బండారు దత్తాత్రేయ, బద్దం, విద్యాసాగర్లపై కేసు కొట్టివేత
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపి బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి సహా పలువురు నాయకులపై నమోదైన ఓ కేసు సోమవారం నాంపల్లి కోర్టులో కొట్టేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జెఏసి, బిజెపి ఇచ్చిన రెండు రోజుల బంద్లో భాగంగా జులై 5, 2011న ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే అభియోగదాలతో సైఫాబాద్ పోలీసులు వీరిపై ఐపిసి సెక్షన్ 143, 188 కింద కేసు నమోదు చేశారు.
కాగా, ఈ కేసులో అనేక వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వారు అభియోగాలు నిరూపించుకోలేకపోయినందున సోమవారం నాంపల్లి క్రిమినల్ కోర్టులోని 1వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కేసును కొట్టేశారు.
ఓయూ విద్యార్థిపై చేయిచేసుకున్న కానిస్టేబుల్
తెలంగాణ సచివాలయం ముందు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిపై ఓ కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. సీఎం కాన్వాయ్కు అడ్డువచ్చాడంటూ విద్యార్థిపై కానిస్టేబుల్ దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన ఓయూ విద్యార్ధులు సచివాలయం ముందు ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసు అధికారులు జోక్యం చేసుకుని సర్ధిచెప్పి విద్యార్థులను వెనక్కిపంపే ప్రయత్నం చేశారు.