వైఎస్ జగన్‌లో మార్పు ఆశించొచ్చా: సాధ్యమేనా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పరాజయంపై అంతర్మథనంలో పడినట్లు తెలుస్తున్నది. ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడంలోనూ నాడు వైఎస్ఆర్ ముందుండే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగ

Recommended Video

    Nandyal By polls : Chandrabab Naidu Vs YS Jagan, What You Need to Know

    హైదరాబాద్/ అమరావతి : ఒక పరాజయం మరో విజయానికి తొలి మెట్టు. ఇది విజయ సాధన దిశగా ముందుకు సాగే వారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి మాత్రం.. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం భవిష్యత్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం కనిపిస్తూనే ఉన్నది.

    ఈ స్థానంలో అధికార తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికలో గెలుపొందినా.. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సీటు అది. భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికలో గెలుస్తామని ప్రగాడ విశ్వాసంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పరాజయంపై అంతర్మథనంలో పడినట్లు తెలుస్తున్నది.

    విపక్షంలో ఉన్నప్పుడు ఓటమి భారం ఎదురైతే.. సంయమనంతో ప్రజల మనస్సులు చూరగొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేయాలి.. అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలుచేస్తూ ముందుకు సాగాలి.. ఇప్పటివరకు అమలు చేసిన ఏజెండాలో మార్పులు అవసరం. ప్రజల అభిప్రాయాలు, సాధారణ సంప్రదాయాలను పాటించడం ఎదగాలని ఆకాంక్షించే వారి సద్గుణాల్లో ఒకటిగా ఉంటుందని విశ్లేషకులు, అనుభవజ్నులు చెబ్తుంటారు. కానీ ఆచరణలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత - ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఆ దిశగా ముందుకు వెళతారా? తమ మదిని గెలుచుకుంటారా? అని యావత్ ఆంధ్రావని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

    ఎక్కడ తప్పు జరిగిందన్న విషయమై మథనం

    ఎక్కడ తప్పు జరిగిందన్న విషయమై మథనం

    ‘ఎందుకిలా జరిగింది!? ఖచ్చితంగా మనదే అనుకున్న నంద్యాలలో ఎందుకు ఓడిపోయాం? ఎక్కడ తప్పు జరిగింది?'' ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌ వైఖరి ప్రస్తావనకు వస్తోంది. మరీ ముఖ్యంగా... సీఎం చంద్రబాబుపై ఆయన వాడుతున్న భాష మారాలని ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నారు. ‘మంత్రి అఖిల ప్రియ వస్త్రధారణపై మా ఎమ్మెల్యే రోజా అనవసర, అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. చుడీదార్‌లలో మా పిల్లలను చూసిన ప్రతిసారీ రోజా వ్యాఖ్యలే గుర్తుకు వస్తున్నాయి. మాకే ఇలా ఉంటే... సామాన్య ప్రజలు ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులంతా రోజాను గుర్తు చేసుకుని మండిపడుతున్నారు'' అని ఒక నాయకుడు చెప్పారు.

    పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సరిదిద్దాల్సిన జగన్‌... తానే చంద్రబాబును దుర్భాషలాడటంవల్ల ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేక భావన నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్‌ చేయడం సహజం. కానీ, మా నాయకుడు మాత్రం తాను అధికారంలోకి వచ్చేదాకా సమస్యలు భరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. దీనిని జనం జీర్ణించుకోలేకపోతున్నారు'' అని మరో నేత విశ్లేషించారు.

    వ్యక్తిగత అభీష్టాన్ని ప్రజలపై రుద్దే యత్నాలు

    వ్యక్తిగత అభీష్టాన్ని ప్రజలపై రుద్దే యత్నాలు

    అవునన్నా.. కాదన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. 2019 వరకు కూడా ఆయనే సీఎం. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. తదనుగుణంగా ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో 2004కు ముందు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సంయమనంతో వ్యవహరించారని చెప్పక తప్పదు. అదే సమయంలో ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడంలోనూ నాడు వైఎస్ఆర్ ముందుండే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎవరికి వారు తమకు అనుకూల మీడియాలో వార్తాకథనాల ప్రచురణ, ప్రసారాలతోనే ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న కాలమిది. ఈ తరుణంలో ఇటు వైఎస్ జగన్ కానీ, అటు నిష్పక్ష పాత వైఖరి ప్రదర్శిస్తామని చెప్పుకునే మిగతా మీడియా గానీ ఒక్క సంగతి విస్మరించొద్దు. ప్రజాభీష్ఠానికి అనుగుణంగా ముందుకు సాగాలే తప్ప.. తమ అభీష్టాన్ని ప్రజలపై రుద్దాలని భావిస్తే తిరిగి తమకే ఎదురు తాకుతుందన్న సంగతి గుర్తుంచుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

    అక్టోబర్ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర సాగేనా?

    అక్టోబర్ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర సాగేనా?

    ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పార్టీ ప్లీనంలో వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటారని తీర్మానం ఆమోదించారు. తదనుగుణంగా నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అక్టోబర్ నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఉత్సాహభరిత వాతావరణం కల్పిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని తమలో నిరాశ నింపిందని అంటున్నారు. నిజానికి నంద్యాల రూరల్‌, గోస్పాడు మండలాల్లో తమకు 14వేల ఆధిక్యం వస్తుందని, నంద్యాల పట్టణంలో టీడీపీ ఆధిక్యం కనపరిచినా... కనీసం 3500 ఓట్లతో తాము నెగ్గుతామని పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నివేదించినట్లు తెలిసింది. కానీ ఈ అంచనాలేవీ నిజం కాలేదని చంద్రబాబు అనుకూల పత్రికలో ఒక వార్తాకథనం ప్రచురితమైంది.

    దీనికి ప్రతిగానా? అన్నట్లు వైఎస్ జగన్ సారథ్యంలోని సాక్షి దినపత్రిక మరో ప్రత్యామ్నాయ కథనం ప్రచురించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభపెట్టి, భయభ్రాంతులకు గురిచేసి విజయాలు సాధించినా ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ఓటమి చెందడంలో అంతకు మించిన రికార్డు సృష్టించిందని ఆ కథనం సారాంశం. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ మొత్తం 56 ఉప ఎన్నికలలో పరాజయాన్ని మూటకట్టుకుంది. అందులో 25 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని ఆ వార్తాకథనం సారాంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 అసెంబ్లీ సాధారణ ఎన్నికల తరువాత వివిధ కారణాలతో పలు అసెంబ్లీ స్థానాలకు 62 ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ 56 స్థానాలలో ఓటమి పాలవ్వడమే కాక 25 స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.

    2006, 2008 కరీంనగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఇది

    2006, 2008 కరీంనగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఇది

    2005లో టీడీపీ ఎంపీ మరణంతో జరిగిన బొబ్బిలి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి అధికార కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి టీడీపీపై విజయం సాధించారు.
    2005లో జరిగిన కరీంనగర్‌ ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్‌పై గెలిచారు. టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సాధన వ్యూహంలో భాగంగా 17 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో 2008 మే 29న ఉప ఎన్నికలు జరిగాయి. దీంతోపాటు విజయనగరం జిల్లా తెర్లాంలో టీడీపీ ఎమ్మెల్యే తెంటు జయప్రకాశ్, కాంగ్రెస్‌నేత పీజనార్దన్‌రెడ్డి హఠాన్మరణంతో ఖైరతాబాద్‌లో ఉపఎన్నికలు ఇదేరోజు జరిగాయి. వీటితో పాటు తెలంగాణలోని, జడ్చర్ల, వికారాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, దొమ్మాట, రామాయంపేట, ఎల్లారెడ్డి, డిచ్‌పల్లి, ఖానాపూర్, మేడారం, హుజూరాబాద్, కమలాపూర్, చేర్యాల్, ఘణ్‌పూర్, ఆలేరు నియోజకవర్గాల్లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తెర్లాంలో టీడీపీ అభ్యర్థి తెంటు లక్ష్మనాయుడు (జయప్రకాశ్‌ కుమారుడు) గెలిచారు. ఇక తెలంగాణలో జరిగిన మిగతా ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌ గెల్చుకున్నది. టీఆర్‌ఎస్‌ ఏడు స్థానాలను, టీడీపీ నాలుగు స్థానాలను, సాధించాయి. సిద్దిపేట సహా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపక్ష టీడీపీ, అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు డిపాజిట్లు కూడా కోల్పోయారు.

    పని చేయని బాబు బాబ్లీ ప్రాజెక్టు పోరాటం

    పని చేయని బాబు బాబ్లీ ప్రాజెక్టు పోరాటం

    2009 డిసెంబర్ తొమ్మిదో తదీన తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించి వెనక్కు తగ్గిన తర్వాత రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు, ఆపార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో 2010 జులై 27న 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ మినహా తక్కిన అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టీడీపీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. 2011 అక్టోబర్‌ 13న నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలు జరగ్గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. అప్పట్లో ఈ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేకంగా పోరాటమని టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ ప్రాజెక్టు వద్దకు వెళ్లి పెద్ద హైడ్రామా నడిపినా ఈ ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.

    పులివెందుల, కడపల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు

    పులివెందుల, కడపల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు

    కాంగ్రెస్‌ పార్టీకి, ఎంపీ పదవికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నెలకొల్పిన తర్వాత జరిగిన కడప లోక్‌సభ స్థానానికి 2011లో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5,45,672 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది. ఇదే సమయంలో జరిగిన పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. 2012 మార్చి 18న కోవూరు, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఘణ్‌పూర్, కొల్లాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏపీలోని కోవూరు స్థానంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విజయం సాధించగా, తెలంగాణాలోని ఆరింటిలో టీఆర్‌ఎస్‌ నాలుగు స్థానాలను, బీజేపీ, ఇండిపెండెంట్లు ఒక్కో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రెండూ ఓటమి పాలయ్యాయి. ఇక టీడీపీ అయితే ఈ ఉప ఎన్నికల్లో కోవూరుతో సహ నాలుగు చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది.

    ఒక్క స్థానాన్ని గెలుచుకోని టీడీపీ

    ఒక్క స్థానాన్ని గెలుచుకోని టీడీపీ

    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చే వారితో పదవులకు రాజీనామాలు చేయించడంతో ఒక ఎంపీ స్థానంతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగాయి. 2012 జూన్‌ 12న జరిగిన ఈ ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలు మినహా తక్కిన 15 అసెంబీల స్థానాలనూ. నెల్లూరు ఎంపీ స్థానాన్నీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకొంది. తిరుపతి, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, ఒంగోలు, నరసన్నపేట, పాయకరావుపేట, అనంతపురం అర్బన్, ఎమ్మిగనూరు, రాయదుర్గం, రైల్వేకోడూరు, ఉదయగిరి, ప్రత్తిపాడు, మాచర్ల, పోలవరం స్థానాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెల్చుకుంది. ఇక పరకాలలో టీఆర్‌ఎస్, నరసాపురం, రామచంద్రాపురంలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాయి. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ ఒక్క స్థానాన్నీ గెల్చుకోలేక చతికిలపడింది. పైగా ఐదు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఏడు స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ కూడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది.

    నంద్యాలలో టీడీపీ బెదిరింపు రాజకీయం ఇలా

    నంద్యాలలో టీడీపీ బెదిరింపు రాజకీయం ఇలా


    ఎన్నికల్లో గెలిచేందుకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే సంస్కృతికి ఆద్యుడు చంద్రబాబేనని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. సాధారణ ఎన్నికల్లోనే కాదు ఉప ఎన్నికల్లోనూ వందల కోట్లు ఖర్చుచేసే విష సంస్కృతికి చంద్రబాబే శ్రీకారం చుట్టారని అంటుంటారు. 1995లో జరిగిన ఓ ఉప ఎన్నిక సందర్భంగా ఓటుకు రూ.500 పంపిణీ చేయించారని గుర్తు చేస్తుంటారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగిన తీరు తాజా నిదర్శనం. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. డబ్బు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

    ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలో ఉండే పార్టీకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. స్థానిక యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోవడంతో సహా అధికారపార్టీకి అన్ని అవకాశాలు ఉంటాయి. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా పూర్తిగా నంద్యాలలోనే మకాం వేయించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు దాదాపు రూ.1,400 కోట్లతో వివిధ పథకాలను మంజూరు చేసి ప్రజలను ప్రలోభాలకు గురిచేశారు. ఓటుకు రూ. 2వేల నుంచి రూ. 10వేల వరకూ పంపిణీ చేశారు. తమకు ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని, పథకాలు ఆగిపోతాయని, పెన్షన్లు - రేషన్‌ నిలిచిపోతాయని బెదిరించారు. డ్వాక్రా మహిళలను కూడా కార్యకర్తల్లా ఉపయోగించుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో తాము ఓడినా నైతిక విజయం తమదేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+