లోకేశ్ ‘మిషన్ రాయలసీమ’ - కడప కేంద్రంగా..!!
తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో రాయలసీమ పైన గురి పెట్టింది. 2019 ఎన్నికల్లో టీడీపీ సీమలో మూడు సీట్లకే పరిమితం అయింది. కడప, కర్నూలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం లో రెండు.. చిత్తూరులో చంద్రబాబు మాత్రమే గెలిచారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందుగానే కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా సీమ నుంచే యువగళం పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్ ఇప్పుడు కడప నుంచి మిషన్ రాయలసీమ ప్రారంభించారు. కీలక నిర్ణయాలు ప్రకటించారు.

రాయలసీమ పై గురి: నారా లోకేశ్ యువగళం కడప జిల్లాలో కొనసాగుతోంది. కుప్పం నుంచి యాత్ర ప్రారంభించిన లోకేశ్ ముఖ్యంగా సీమ జిల్లాల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కడప జిల్లాలో యాత్ర సక్సెస్ చేసేందుకు పార్టీ ప్రత్యేకంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే లోకేశ్ 'మిషన్ రాయలసీమ'ను ప్రకటించారు. ఈ కార్యక్రమంతో ఈ ప్రాంత రూపురేఖలే మార్చేస్తామన్నారు.
సీమలో అపారమైన వనరులు ఉన్నాయని.. పెద్దఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి.. స్థానికంగానే యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హార్టీకల్చర్ హబ్గా మార్చి ప్రపంచానికి అవసరమైన పండ్లను ఎగుమతి చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ రూపుమాపుతామని హామీ ఇచ్చారు.
దగ్గరుంచి చూసాను: రాయలసీమలో 118 రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,516 కి.మీ. పాదయాత్ర చేశానని లోకేశ్ చెప్పుకొచ్చారు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూశానన్నారు. అధికారంలోకి వచ్చాక మిషన్ రాయలసీమ ద్వారా వాటన్నింటినీ రూపుమాపుతామని లోకేశ్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 49 మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించాలని..అభివృద్ధి అంటే చూపిస్తామని స్పష్టం చేసారు.
చేయకపోతే కాలరు పట్టుకొని నిలదీయాల ని వ్యాఖ్యానించారు. లేపాక్షి నాలెడ్జ్కి ఇచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో రాయలసీమలో పెద్ద ఎత్తున పనులు చేపట్టామని లోకేశ్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిపివేసిందని ఆరోపించారు.

పులివెందులకు నీళ్లు: రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో పట్టిసీమను తీసుకొచ్చి కృష్ణాజలాలను ఇచ్చామని చెప్పారు. పులివెందులకు కూడా నీళ్లిచ్చామని లోకేశ్ చెప్పుకొచ్చారు. రూ.22 వేల కోట్లతో వాటర్గ్రిడ్ పనులను చేపట్టామని వివరించారు. గుండ్రేవుల ప్రాజెక్టు కడితే 30 టీఎంసీలతో ఆ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు.
కర్నూలులో జైన్ ఇరిగేషన్, సోలార్, టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చామని చెప్పారు. వైసీపీ అంటేనే ఇసుక, భూ మాఫియా, మద్యం దోపిడీ గుర్తుకొస్తాయని ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి బయటపెట్టినా స్పందన లేదన్నారు. టీడీపీ వచ్చిన వెంటనే భూఆక్రమణలపై సిట్ వేస్తామని వెల్లడించారు ఇంటిస్థలాల కొనుగోలులో రూ.7 వేల కోట్ల స్కాం జరిగిందని లోకేశ్ ఆరోపణలు చేసారు.












Click it and Unblock the Notifications