నారా లోకేష్.. సేమ్ టు సేమ్.. మళ్లీ ఏసేశాడు?
ప్రజల కోసం పోరాడేందుకు బయలుదేరిన తనపై 20 కేసులు పెట్టారని లోకేష్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లా నగరిలో కొనసాగుతోంది. యాత్ర 18వ రోజున వివిధ వర్గాల ప్రజల్ని లోకేష్ కలిశారు.. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో లోకేష్ ఓ హోటల్ దగ్గర ఆగి సెల్ఫీ దిగారు.
ఆ ఫొటో ఇప్పుడు వైరలవుతోంది. హోటల్ పేరు పబ్జీ కావడంతో సెల్ఫీ దిగి ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ గతంలో ముఖ్యమంత్రి జగన్ ను పబ్జీ సీఎం అంటూ ఘాటుగా విమర్శించేది. ఇప్పుడు ఆ హోటల్ పేరు అదే కావడంతో లోకేష్ కావాలనే సెల్ఫీ తీసుకున్నారనే చర్చ నడుస్తోంది.

ప్రజల కోసం పోరాడేందుకు బయలుదేరిన తనపై 20 కేసులు పెట్టారని, ముఖ్యమంత్రి కి తాను ఆఫర్ ఇస్తున్నానని, 400 కేసులు పెట్టుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్ పాదయాత్ర చేసినప్పుడు వారి మైకును చంద్రబాబు లాక్కున్నారా? అని ప్రశ్నించారు.
జగన్ తనపై పెట్టే దృష్టి బదులు పోలీసులు ఎదుర్కొంటోన్న ఇబ్బందులపై దృష్టిపెడితే బాగుంటుందని హితవు పలికారు. మూడు సరెండర్ సెలవులు పెండింగ్ లో ఉన్నాయని, ఒక్కో కానిస్టేబుల్ కు రూ.75వేలు, ఎస్ఐకి రూ.90వేలు, సీఐకి రూ.లక్ష రావాల్సి ఉందంటూ లెక్క చెప్పారు.

8 నెలలుగా టీఏ, డీఏ, మెడికల్ బిల్లులు పెండింగులో ఉన్నాయని.. తమ సమస్యలపై కూడా పోరాడండని పోలీసులు చెబుతున్నారని, ప్రతి ఏడాది ఇస్తానన్న జాబ్ కేలండర్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ హామీ ఏమయ్యాయని, అవి కూడా గోవిందానేనా అంటూ ప్రశ్నించారు.
రాజ్యసభ సభ్యులతో కలిపి 31 మంది ఎంపీలు ఉన్నారని, మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న హామీ ఏమైందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్, చంద్రన్నబీమా, చంద్రన్న కానుకలు లేకుండా చేశారని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలంతా పేదవారుగా మారారని, టీడీపీ అధికారంలోకి రాగానే నగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications