జీతాలందక జీవితాలు అగమ్యగోచరం.!ఆరు నెలల బకాయిలు చెల్లించాలని నారా లోకేష్ డిమాండ్.!
అమరావతి/హైదరాబాద్ : కోవిడ్ సమయంలో అత్యవసర సేవలందించేందుకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్న 26,325 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఆరు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఆందోళనలో వున్నారని, వారికి తక్షణమే బకాయిలు విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. కోవిడ్ వ్యాప్తి తొలిదశ సమయంలోనే వ్యాప్తి నియంత్రణ కోసం ఫ్రంట్ లైన్ వారియర్లుగా వేలాది మందిని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకున్నారని పేర్కొన్నారు. కోవిడ్ వచ్చిన వారిని సొంత కుటుంబసభ్యులే దూరం పెట్టిన పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి కోవిడ్ బాధితులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన ఫ్రంట్లైన్ వారియర్స్ని పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. సెలవుల్లేవు, పండగలు-పబ్బాలైనా విధుల్లో వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని నారా లోకేష్ ఆరోపించారు.
ప్రజల ప్రాణాలు కాపాడటానికి వేలకోట్ల అప్పులు చేయాల్సి వచ్చిందని పదే పదే చెబుతోన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, 26,325 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కి 6 నెలలుగా జీతాలివ్వలేదని, చేసిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో సేవలు అందించేవారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలలో కొన్ని గ్రేస్ మార్కులు ఇస్తామని ఆశపెట్టడంతో చాలా మంది ఇప్పుడు ప్రాణాలకు తెగించి కష్టపడ్డారని గుర్తు చేసారు. భవిష్యత్తులో తమని రెగ్యులర్ చేస్తారనే ఆశతో కొందరు జీతాలు ఇవ్వకపోయినా పనిచేస్తూనే వున్నారని అన్నారు. ఫ్రంట్లైన్ వారియర్లకు ఆరునెలలుగా జీతాలు పెండింగ్లో పెట్టిన జగన్ ప్రభుత్వం నెలకు లక్షల్లో తీసుకుంటున్న సలహాదారులకు ఒక్కరికైనా బకాయి పెట్టిందా అని నిలదీశారు. సొంత కాంట్రాక్టర్లకు వేలకోట్లు బిల్లులు చెల్లించడానికి వున్న ఖజానా, కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్ల జీతాలివ్వడానికి ఖాళీ అయ్యిందా అని ప్రశ్నించారు. తక్షణమే కోవిడ్ నియంత్రణకు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తోన్న ఫ్రంట్లైన్ వారియర్స్కి తక్షణమే బకాయి పడిన జీతాలు చెల్లించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.