టిలో లోకేష్ ఫస్ట్, తొందరైతే దోచిందివ్వు: జగన్కు టిడిపి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా తన తొలి పర్యటన తెలంగాణలోనే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గురువారం చెప్పారు. తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వంలో తన ప్రమేయం ఏమాత్రం ఉండదని చెప్పారు.
అంతకుముందు బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా తాము పార్టీ కార్యకర్తలను ఆదుకుంటామని లోకేష్ అన్నారు. ప్రతి టిడిపి కార్యకర్తకు నూటికి నూరు శాతం సంక్షేమ నిధి ద్వారా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎపి, టి అనే తేడా లేకుండా కార్యకర్తలను ఆదుకుంటామన్నారు.
దోపిడీ సొమ్ము ఇవ్వు: జగన్కు అచ్చెన్నాయుడు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం మండిపడ్డారు. కార్మిక శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాము ఇచ్చిన హామీలు అన్నింటిని నిలబెట్టుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. చంద్రబాబు నాయకత్వంలో క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.
రైతుల రుణమాఫీ విషయంలో జగన్ గాబరా పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు అంత తొందర ఉంటే ఎలా అన్నారు. జగన్కు అంత తొందరైతే తాను దోచుకున్న సొమ్మును కట్టాలన్నారు. జగన్ దోపిడీ సొమ్ముతో ఇప్పుడే రుణమాఫీ చేస్తామన్నారు. రైతు రుణమాఫీ పైన త్వరలో ప్రకటన చేస్తామన్నారు. డ్వాక్రా, రైతు రుణమాఫీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.