జగన్ మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరు, రాజధాని రైతుల త్యాగం వృధా కాదు: నారా లోకేష్ సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని రాజధాని రైతులు చేస్తున్న పోరాటం 700 రోజుకు చేరుకుంది. 700 రోజులుగా ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం తాము తమ భూములను త్యాగం చేసి రాజధాని కోసం ఇచ్చామని, అలాంటి ఏపీ రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించవద్దని జగన్ దృష్టికి తీసుకు వెళ్లడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

జగన్ కుట్రలపై అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులకు : లోకేష్
తాజాగా రాజధాని అమరావతి ఉద్యమంలో భాగంగా వివిధ జిల్లాల ప్రజల మద్దతు కోరుతూ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టి గత 16 రోజులుగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా రాజధాని అమరావతి ఉద్యమం 700 రోజులు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజధానిపై ప్రభుత్వ అధినేతగా వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్వేష కుట్రలపై అమరావతి రైతులు, కూలీలు సాగిస్తున్న పోరాటాలు 700 రోజులకు చేరుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.

జనసంద్రంగా మహా పాదయాత్ర, రైతుల త్యాగాలు నిరుపయోగం కావు
రాజధాని అమరావతి పోరాటాన్ని 30 వేల మంది రైతుల సమస్యగా చిన్న చూపు చూసిన పాలకుల కళ్ళు బైర్లు కమ్మేలా కోట్లాదిమంది రాష్ట్ర ప్రజలు అమరావతి రైతుల పక్షాన మద్దతుగా నిలుస్తున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర వివిధ జిల్లాల ప్రజల మద్దతుతో జనసంద్రాన్ని తలపిస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజా రాజధాని కోసం భూములు ఇచ్చి తృణప్రాయంగా రైతులు త్యాగం చేశారని, వారి త్యాగాలు నిరుపయోగం కావని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరు
జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోట్లాది మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్న నారా లోకేష్ అమరావతి వైపే న్యాయం ఉందని స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు అమరావతికి ఉందని ఆయన పేర్కొన్నారు .ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని నారా లోకేష్ చెప్పారు. జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి అంటూ అమరావతి ఉద్యమం పట్ల, రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అన్న టిడిపి ఆకాంక్షను బలంగా స్పష్టం చేశారు టిడిపి నేత, మాజీ మంత్రి నారా లోకేష్.

అమరావతి ఉద్యమానికి టీడీపీ మద్దతు
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 700 రోజులూ పూర్తయిందని రాజధానిగా అమరావతిని సాధించే ఉద్యమానికి టీడీపీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. అంతేకాదు ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి ఆంధ్రుల రాజధానిగా కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగుతున్న ఉద్యమానికి 700 రోజులు పూర్తయ్యాయని, అమరావతి ఉద్యమానికి న్యాయస్థానంలో న్యాయం జరగాలని దేవస్థానంలో ధర్మం నిలవాలని అమరావతి విజయకేతనం ఎగురవేయాలని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఠీవిగా నిలబడాలని, రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగాలని టీడీపీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications