‘జగన్ మోడీ రెడ్డి కోడి కత్తి డ్రామా’ అంటూ లోకేష్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోడి కత్తి దాడి, జగన్ మోడీ రెడ్డి అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
'చంపాలనే దాడి, జగన్ తప్పించుకున్నారు': విమానాశ్రయంలో ఏం జరిగిందంటే..?
రాష్ట్ర ప్రజలను కించపరిచే విధంగా వైయస్ జగన్ మాట్లాడటం దారుణమని నారా లోకేశ్ అన్నారు. 'అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఏ1 ముద్దాయి 'జగన్ మోడీ రెడ్డి'.. దొంగ, దొంగ అని అరుస్తున్నారు' అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
'అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, ఛానల్లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు. కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తా అని పోలీసులకు బెదిరింపులు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేదు అంటూ ప్రజలను కించపరిచే విధంగా 'జగన్ మోడీ రెడ్డి' మాట్లాడటం దారుణం' అంటూ విమర్శలు గుప్పించారు.
విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్పై గురువారం శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం 'జగన్ మోడీ రెడ్డి'కి కొత్త కాదని శుక్రవారం కూడా లోకేష్ విమర్శించారు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు.