అలా చేస్తే నా మంత్రి పదవి ఊడుతుంది: లోకేష్, ‘తోక ముడిచిన జగన్ పార్టీ’
Recommended Video
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడమే వైసీపీ నైజమని లోకేశ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. కొంతసేపు పాదయాత్ర చేపట్టి ప్రజలను పలకరించారు. తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలో జలభవన్కు శంకుస్థాపన చేశారు.
తోకముడిచిన వైసీపీ
అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, డ్వామాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నిక తీర్పు ప్రభుత్వ పాలనకు రెఫరెండమని పదేపదే ప్రచారం చేసిందని, టీడీపీ అఖండ విజయం సాధించాక తోకముడిచి మాట మార్చిందని ఎద్దేవా చేశారు.
డబ్బా కొట్టుకుంటోంది..
జనబలం తమ వైపే ఉందని వైసీపీ సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకుంటోందని లోకేష్ విమర్శించారు. దేశం మొత్తమ్మీద ఉపాధిహామీ పథకం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చక్కగా అమలవుతోందని, ఇది చూసి ఓర్వలేక కొందరు వైసీపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్ఈడీ వెలుగులు నింపుతాం..
ఫలితంగానే రాష్ట్రానికి రావాల్సిన రూ. 600 కోట్ల ఉపాధి వేతన బకాయిలు ఆలస్యమయ్యాయని వివరించారు. 2019 నాటికి ప్రతి గ్రామంలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామని, 250 జనాభా దాటిన గ్రామాల్లో రూ.500 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడతామని చెప్పారు.
నా మంత్రి పదవి ఊడుతుంది...
అక్టోబరు నెలాఖరుకు తపాలా శాఖ ద్వారా ఉపాధి వేతనాలు చెల్లింపునకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అధికారులు సహకరించకపోతే మంత్రిగా తన పనితీరు దెబ్బతింటుందని, అప్పుడు ఆరు నెలల్లో సీఎం తనను పదవి నుంచి తప్పిస్తారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ సరదా వాతావరణం నెలకొంది.