మాకేం పంతాలు, పట్టింపులు లేవు: ముద్రగడ దీక్షపై నారాయణ
విజయవాడ/ రాజమండ్రి: కాపులను బీసీల్లో చేర్చాలంటూ రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని దీక్ష విరమించాలని మంత్రి నారాయణ కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఎటువంటి పంతాలు, పట్టింపులు లేవన్నారు.
కాపు కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ స్కాలర్షిప్పులు మంజూరు చేస్తామని చెప్పారు. మంజునాథ కమిషన్ నివేదిక ఇచ్చేందుకు ఇంకా ఏడు నెలల 24 రోజులే మిగిలి ఉందని, నివేదిక రాగానే కాపులను బీసీల్లో చేరుస్తామని ఆయన చెప్పారు.

గడువుకన్నా ముందే నివేదిక ఇవ్వాలని జస్టిస్ మంజునాథను కోరామని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని వైఎస్ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని, ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని నారాయణ అన్నారు.
పదిన్నర ఏళ్ల కాలంలో కాపుల రిజర్వేషన్ల కల్పనకు అప్పుడు చర్యలు తీసుకోనప్పుడు ఇప్పుడు ఏడు నెలల 24 రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెబుతుంటే ఇదేమిటని ఆయన అడిగారు.
ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష న్యాయమైనదేనని, కాపులకు సాయం చేస్తామని ముందుకొచ్చింది తెలుగుదేశం పార్టీయేనని యూసీసీ-సీసీసీ చైర్మన్ కొండలరావు అన్నారు. ముద్రగడ పద్మనాభంను శనివారం కొండలరావు కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త రాష్ట్రం వల్ల తలెత్తిన సమస్యలతో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేన్నారు. అయితే సీఎం చంద్రబాబు కాపులకు న్యాయం చేసి తీరుతారని ఆయన తెలిపారు. కాపు యువత ఆత్మహత్యలకు పాల్పడొద్దని కొండలరావు సూచించారు.












Click it and Unblock the Notifications