'కిరణ్! తీరక చేసుకొని మిణుగురులు సినిమా చూడండి'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మిణుగురులు చిత్రం చూడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం సూచించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, వికలాంగుల వసతి గృహాల అధ్వాన్న పరిస్థితులకు మిణుగురులు చిత్రం అద్దం పడుతోందన్నారు. ముఖ్యమంత్రి కాస్త తీరిక చేసుకొని ఈ సినిమాను చూడాలని నారాయణ కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
ముఖ్యమంత్రిపై శ్రవణ్ మండిపాటు
ముఖ్యమంత్రి కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి ఆరాట పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ కుమార్ వేరుగా అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని, కొత్త పార్టీ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి నాయకత్వంలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
అందులో భాగంగానే సీమాంధ్రలో పలు ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఫ్లేక్సిలు దర్శనం ఇస్తున్నాయని అన్నారు. సమైక్య హోర్డింగ్లపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదు, సమాచార శాఖ ఎందుకు చర్య తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టిస్తూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
రేపోమాపో కొత్త పార్టీ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని అన్నారు. కిరణ్ ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ఏర్పాటు ఆగదని అన్నారు. ప్రజలపై అనవసర భయాలు రుద్దడం తగదన్నారు. కొత్త నాటకంలో భాగంగానే రాష్ట్రపతి పంపిన బిల్లును రాజ్యాంగ విరుద్ధం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, ఆయన్ని బర్తరఫ్ చేయాలని వివేక్ డిమాండ్ చేశారు.