ఎపి సిఎం ఇంతగా అడుగుతుంటే...ప్రధానిగా మోడీ సమాధానం చెప్పొద్దా?
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై పిఎంమోడీని ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పి తీరాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ ఏ విధంగా అన్యాయం చేశారో సిఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా స్వయంగా క్లిప్పింగ్ లు ప్రదర్శిస్తూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు ఏకంగా ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ భవనంలోనే ప్రధాని తమకు చేస్తున్నఅన్యాయంపై వివిధ జాతీయ పార్టీల నేతలను కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలుగెత్తి చాటారు. జాతీయ మీడియా సమక్షంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. మరి ఇంత చేస్తుంటే ప్రధాని మోడీ పార్టీ నేతగా కాదు...బాధ్యతాయుతమైన ప్రధాని పదవిలో ఉన్నవ్యక్తిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మోడీ ఎందుకు...మాట్లాడటం లేదు
ఎపికి జరిగిన అన్యాయంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలకు ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదు...ఎందుకు సమాధానం చెప్పడం లేదు?...ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ స్థాయి వేదికల మీద అనేక ఆరోపణలు చేసినా ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదంటే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ నిజం కాబట్టే మారు మాట్లాడలేకపోతున్నారా?...లేక సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా?...లేక నిజంగానే ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు సమస్యలపై అవగాహన లేకపోవడమా?...అహంకారమా?...లేక సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా?...సమాధానం ఏదైనా ఈ విషయంలో మోడీ మౌనం ఖచ్చితంగా తప్పేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సిఎం...నిన్నటి మిత్రుడు...ఆధారాలతో సహా
సిఎం చంద్రబాబు ఆరోపణలు ఏదో ఉద్దేశంతో చేస్తున్నట్లు ప్రధాని భావించినప్పటికీ సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత అయితే అటు నైతికంగా...ఇటు రాజ్యాంగబద్దంగా...ఏ రకంగా నైనా ఆ అవసరం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎపికి జరిగిన అన్యాయం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు...అందుకోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగారు...ఎన్టీఏ కూటమి నుంచీ తప్పుకున్నారు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపిస్తున్నారు. కేంద్రంపై తిరుగుబాటు పోరాటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దేశాధినేతగా భాధ్యతగా స్పందించాల్సిన అవసరం లేదా?...అలా స్పందించకుంటే విపరీత పరిణామాలు చోటుచేసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి?...
ఇంత పెద్ద ఆరోపణ...అయినా బదులు లేదు...
సీఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన చేసిన ఒక ఆరోపణ నేషనల్ మీడియాని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై వారు మరోమారు ప్రశ్నించగా దీని పై చంద్రబాబు స్పష్టత ఇస్తూ, ఆధారాలు కూడా చూపించారు. ఆ విషయం ఏంటంటే..
ఫిబ్రవరి 4 నుంచి టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన మొదలు పెట్టారు...ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం రూ.350 కోట్లు ఇచ్చింది...అలా ఆ డబ్బు ఏపికి కూడా వచ్చింది. ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న ఆర్ బిఐతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు...ఇలా డబ్బులు వేసి మరీ, వెనక్కు తీసుకోవటం ఎక్కడన్నా చూసారా ? ఇదిగోండి ఆధారాలు అంటూ, ఎకౌంటు లో డబ్బులు పడిన ఎంట్రీ, వెంటనే డబ్బులు వెనక్కు తీసుకున్న ఎంట్రీ కాపీలు చూపించారు. దీంతో ఆశ్చర్యపోవటం జాతీయ మీడియా వంతైంది.
నాలుగేళ్లుగా...ఎందుకంటే?...
నాలుగేళ్లుగా ఎందుకు తిరగబడలేదనే ప్రశ్నకు ఇదే తన సమాధానం అని సిఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ తాను ముందే తిరగబడి ఉంటే ఇలాగే అప్పటినుంచి జరిగి ఉంటే రాష్ట్రానికి ఎంత నష్టమని చంద్రబాబు ప్రశ్నకు బదులు లేకుండా పోయింది. ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారని...మరి నాలుగేళ్ల ముందు చంద్రబాబు బయటకు వచ్చి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి అంటున్నారు. పోలవరం అసలు మొదలే అయ్యేది కాదు...అమరావతికి ఎన్నో ఇబ్బందులు వచ్చేవని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎపి సిఎం చంద్రబాబు చూపుతున్న ఆధారాలను బట్టి ఇది నిజమేనని తెలుస్తోంది. ఒకవేళ కాకుంటే అందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సమస్య జాతీయ స్థాయికి...సమాధానం చెప్పాల్సిందే!
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కూడా చంద్రబాబు రాష్ట్రానికి జరిగిన అన్యాయాల గురించే ప్రస్తావించారు మినహా ఎక్కడా కూడా ఇతర అంశాలు మాట్లాడలేదు. అలాగే మీడియా సమావేశంలో ఎపికి జరిగిన అన్యాయంపై ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే కనీసం సంబంధిత కేంద్ర మంత్రుసమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదీ లేదు...మానవ వనరుల శాఖా మంత్రి మాట్లాడుతూ అంత చేసాం ఇంత చేసాం అని చంద్రబాబు విమర్శలకు సమాధానంగా చెప్పారే తప్ప ఆయన కూడా ఎపికి ఇచ్చిన హామీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ చంద్రబాబు ఆరోపణలకు ప్రధాని మోడీ ఎందుకు స్పందించాలి అని బిజెపి వితండవాదం చేస్తే అది చాలా తప్పంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక రాష్ట్రం తన సమస్యల గురించి జాతీయ స్థాయికి తీసుకెళ్లినప్పుడు ప్రధానిగా కనీసం మోడీ స్పందిచాల్సిన బాధ్యత ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.