జగన్తో ప్రాణాపాయమన్న సుధాకర్ తల్లి.. చంద్రబాబుకు శాదన్ ఫ్రాయిడా.. తర్వాతి టార్గెట్ ఎవరంటే..
సస్పెన్షన్కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విశాఖపట్నంలో రోడ్డుపై పోలీసులు.. డాక్టర్ ను కొట్టి, అరెస్టుచేసి, మెంటల్ ఆస్పత్రికి పంపిన తీరు ఇప్పటికే చర్చనీయాంశంకాగా, దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ లో ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్లు సిద్ధమవుతున్నాయి.
వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో కొడుకును చూసి సుధాకర్ తల్లి తీవ్ర ఆవేదన చెందారు. సీఎం జగన్ తో తన కొడుక్కి ప్రాణహాని ఉందని ఆరోపించారు. మరోవైపు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం చంద్రబాబు వాడకం వల్లే డాక్టర్ కు మెంటలెక్కిందని అన్నారు. 'తర్వాతి టార్గెట్' అంటూ ఎంపీ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి..
తాగితే మెంటల్ ఆస్పత్రికా?
ఎన్నో ఏళ్ల నుంచి డాక్టర్ గా పనిచేస్తూ, మంచి పేరు సంపాదించుకున్న తన కొడుకుపై ఇవాళ పిచ్చివాడని ముద్రవేయడం దారుణమని, మద్యం తాగినందుకే మెంటల్ ఆస్పత్రిలో చేర్చితే, మరి తాగుబోతులందరినీ ఇక్కడికే పంపుతారా? అని డాక్టర్ సుధాకర్ తల్లి ప్రశ్నించారు. కొడుకును చూసేందుకు వైజాగ్ మెంటల్ ఆస్పత్రికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నా బిడ్డను మళ్లీ మామూలు పొజిషన్ లో నా చేతికి అప్పగించాలి.. ఇంతకన్నా నేను అడిగేదేమీ లేదు. నాకు 74. ఈ వయసులో నాకీ బాధ అవసరమా? మందు తాగాడని చెబుతున్నారు.. అలాంటప్పుడు కేజీహెచ్కో మరో ఆస్పత్రికో తీసుకెళ్లకుండా మెంటల్ ఆస్పత్రికి తెచ్చారంటే అందులో ఎంత కుట్రుందో అర్థం చేసుకోవచ్చు''అని ఆవేదన చెందారు.
అచ్చం సినిమాలాగా..
కేవలం మాస్కులు లేవని అడిగినందుకే ప్రభుత్వం పగపట్టిందని, సస్పెండ్ అయిన తర్వాత కూడా నిత్యం ఫోన్లు, పేపర్లలో రాతలతో భయంకరమైన ఒత్తిళ్లకు గురిచేశారని సుధాకర్ తల్లి చెప్పారు. ‘‘ఇవాళ నా బిడ్డను బలి చేశారు. ఇంకా జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదే. ఇంకా ఎంతమంది బలైపోతారోనని భయంగా ఉంది. సస్పెండ్ అయిన తర్వాత కొంచెం వర్నీ అయిఉండొచ్చు, దాన్ని కూడా పిచ్చి అని ముద్రవేయడం అచ్చం సినిమాల్లో చూపించినట్లుగా ఉంది. నిజానికి వాడు తాగలేదు, సరే ప్రభుత్వం చెప్పినట్లు తాగాడే అనుకుందాం, ఈ సీఎం అమ్మబట్టేకదా జనం తాగుతున్నది, ఇన్నాళ్లూ జనం ప్రశాంతంగానే ఉన్నారుగా..''అని విమర్శించారు. సుధాకర్ ను డిశ్చార్జ్ చేస్తే, వేరే ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటామని కుటుంబీకులు తెలిపారు.
చంద్రబాబు వల్లే..
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మొదటి నుంచీ టీడీపీకి ఫేవర్ గా పనిచేస్తున్నాడని, చంద్రబాబు డైరెక్షన్ లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పిన మేరకే మాస్కులపై డాక్టర్ వీడియో చేశారని వైసీపీ మొదటి నుంచీ వాదిస్తోంది. శనివారం విశాఖలో సుధాకర్ తప్పతాగి వీరంగం సృష్టించినందుకే అరెస్టు చేశామని, కేజీహెచ్ వైద్యుల సిఫార్సు మేరకే ఆయనను మెంటల్ ఆస్పత్రికి పంపామని వైజాగ్ సీపీ ఆర్కే మీనా తెలిపారు. చంద్రబాబు వాడుకుని వదిలేయడం వల్లే మత్తు డాక్టర్ కు మెంటలెక్కిందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
సుధాకర్ కు యూక్యూట్.. బాబుకు శాదన్
‘‘ఉద్యోగం చేసుకుంటూ తన మానాన తను బతుకుతోన్న డాక్టర్ సుధాకర్ ను టీడీపీ వాళ్లే రోడ్డునపడేశారు. సస్పెండ్ అయ్యేదాక రెచ్చగొట్టారు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు మెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వచ్చిందని సైకియాట్రిస్టులు తేల్చారు. ఇక చంద్రబాబుకు శాదన్ ఫ్రాయిడా అనే మానసిక రుగ్మత ఉంది. అంటే, ఎదుటివాళ్ల దురదృష్టాన్ని చాటుగా గమనిస్తూ ఆనందించే టైపు'' అని వైసీపీ ఎంపీ విమర్శించారు.
తర్వాతి టార్గెట్?
డాక్టర్ సుధాకర్ ఘటనపై ఎంపీ విజయసాయి చేసిన కామెంట్లలో ‘తర్వాతి టార్గెట్'అని పేర్కొనడం దుమారం రేపుతున్నది. చంద్రబాబు పంచన చేరితే ఎంత చదువుకున్నవాళ్లకైనా.. గుర్తింపు మొత్తం గంగలో కలిసిపోతుందన్న ఆయన.. ‘‘ఎల్లో వైరస్ ప్రభావంతో వైజాగ్లో డాక్టర్ చేసిన వీరంగం చూస్తే.. తర్వాతి టార్గెట్ ఎవరనేది అర్థం కావడంలేదా? అయ్యో అంత అన్యాయం జరిగిందా? అని ఒక ప్రెస్ నోటు రిలీజ్ అవుతుంది''అని ఎంపీ రాసుకొచ్చారు. ప్రభుత్వ, రాజ్యాంగబద్ధ ఉద్యోగులుగా ఉంటూ చంద్రబాబు కోసం పని చేసి అడ్డంగా దొరికిపోయిన అధికారులను ఉద్దేశించే ఎంపీ ఈ హెచ్చరిక చేసుంటారని వైసీపీలో చర్చ జరుగుతోంది.
Recommended Video
పంచితే తలా రెండు పైసలు..
కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రకటనకంటే ముందే చంద్రబాబు కుటుంబంతోసహా హైదరాబాద్ వచ్చేయడంపై వైసీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 4.0లో భాగంగా అంతర్ రాష్ట్ర రవాణాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా ఏపీకి వస్తారా? లోకేశ్.. మీ నాన్నను ఇప్పటికైనా వదిలెయ్ అంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. ‘‘కరోనాపై పోరుకు చంద్రబాబు ఇచ్చిన 10 లక్షల విరాళాన్ని ఐదు కోట్ల మందికి పంచితే, తలకు రెండు పైసలు వస్తాయని నెటిజెన్లు లెక్క తేల్చారు. కుటుంబానికో కోడి గుడ్డు కూడా రాదు కదా బాబూ. ఈ మాట ఎవరైనా అడిగితే, ఓడించిన ప్రజలకు సంపాదనంతా ఇచ్చి లోకేశాన్ని రోడ్డున పడేయాలా అని ప్రశ్నిస్తాడేమో''అని ఎంపీ సెటైర్ వేశాడు.