నరసాపురంలో నేపాల్ యువతులు; ఎందుకొచ్చారంటే..కోడిపందాల్లో కొత్త ట్రెండ్
పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో నేపాల్ యువతులు హల్ చల్ చేశారు. దీంతో విషయం పోలీసుల వద్దకు చేరింది. ఒకేసారి ఇంత మంది నేపాల్ అమ్మాయిలకు నరసాపురంలో పనేంటా అని అరా తీసిన పోలీసులు ఆ తర్వాత వారి రాక వెనుక కారణం తెలుసుకొని అవాక్కయ్యారు.
నరసాపురంలో నేపాల్ యువతుల సందడి చివరకు పెద్ద సంచలనంగా మారింది. పట్టణంలో ఒక లాడ్జిలో బస చేసిన వీరు చుట్టుప్రక్కల ప్రాంతాలంతా తిరుగుతూ సందడి చేశారు. మొదటి రోజు పేరుపాలెం బీచ్తో పాటు పట్టణ వీధుల్లో చక్కర్లు కొట్టారు. వీరంతా నేపాలీ అమ్మాయిలు కావడం...గుంపులు, గుంపులుగా వెళుతుండటంతో వీరిని చూసేందుకు స్థానికులు కూడా ఆసక్తి చూపారు. రాత్రి సమయాల్లో కూడా వీరు రోడ్లపై తిరుగుతుండటం, రెండో రోజు బయటకు వెళ్లేందుకు గంటల తరబడి రోడ్డుపై నిరీక్షించడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆదివారం రాత్రి వీరిని విచారించారు.
ఆ తర్వాత వీరి రాక వెనుక కారణం తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. కోడి పందాల కోసం తరలివచ్చే వీఐపీలకు రాచమర్యాదలు చేయడం కోసమే వీరిని ఒక కోడి పందాల బరి నిర్వాహకుడు నేపాల్ నుంచి నరసాపురానికి రప్పించాడని తెలుసుకున్నారు. భీమవరం మండలానికి చెందిన ఆ బరి నిర్వాహకుడు మధ్యవర్తి ద్వారా 33 మంది మంది నేపాల్ యువతులను ఏసీ లగ్జరీ బస్సులో మూడు రోజుల కిందట పట్టణానికి రప్పించాడట. అయితే పోలీసుల విచారణతో భయపడిన నేపాల్ యువతులు మాత్రం తాము విహార యాత్ర, స్టడీ టూర్ పేరుతో వచ్చామంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే చివరికి పోలీసులు వారి పాస్పోర్టులను పరిశీలించి గట్టిగా ప్రశ్నించడంతో వీరిలో కొందరు యువతులు అసలు విషయం చెప్పేశారట. దీంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత వీరంతా వచ్చిన బస్సులోనే సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయినట్లు తెలిసింది.