నాగార్జున సాగర్ లో వైభవోపేతంగా..: సీఎం రేవంత్ రెడ్డి రాక
తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి, జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం మహా వరుణయాగాన్ని నిర్వహిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్.. దీనికి వేదిక అయింది. జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ వరుణయాగాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ తెల్లవారు జామున 4 గంటలకు నాగార్జున సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్హౌస్ ప్రాంగణంలో ఈ క్రతువు ఆరంభమైంది. అత్యంత వైభవోపేతంగా కొనసాగుతోంది.
రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే ఈ యాగం ముఖ్య ఉద్దేశ్యం. దీనికోసం యాగశాల ప్రాంగణంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 11 హోమగుండాలను ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 108 మంది ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం అర్చకులు ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది.

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. ఈ యాగశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోన్నారు. వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే ప్రధాన జలాశయం నాగార్జున సాగర్ వద్ద ఈ యాగం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, ప్రాజెక్టులన్నీ జలకళతో నిండాలని ప్రభుత్వం తలపెట్టిన ఈ పూజల్లో పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా ఇక్కడికి చేరుకోనున్నారు. శాస్త్రోక్తంగా జరిగే పూర్ణాహుతి ముగింపు పూజల్లో సీఎం పాల్గొని ప్రత్యేక హారతి ఇవ్వనున్నారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన, వీఐపీల రాక నేపథ్యంలో సాగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. నల్గొండ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దాదాపు 1,000 మంది సిబ్బందితో భారీ నిఘా ఏర్పాటు చేశారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవాలని, రైతాంగానికి మేలు జరగాలని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఈ వరుణయాగం నిర్వహిస్తోండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.



Click it and Unblock the Notifications