రాజధానిపై కేంద్రానికి రిపోర్ట్, గుంటూరే: సంస్థలు ఎక్కడ?
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక పైన నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన ప్రాథమిక నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఆ నివేదికను మంగళవారం రాత్రికే ఏపీ ప్రభుత్వానికి చేరినట్లుగా తెలుస్తోంది. కొత్త రాజధాని ప్రాంతం నిర్ణయించడానికి ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నదీ కమిటీ ఆ నివేదికలో పొందుపర్చింది.
మరోవైపు, రాజధాని నిర్మాణం కోసం నిధులు ఎలా సమీకరించాలన్న అంశం పైన సిఫార్సులు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో ఎంపీ సుజనా చౌదరి, కెనరా బ్యాంకు మాజీ సీఎండీ తదితరులు ఉంటారని తెలుస్తోంది.
కాగా, విజయవాడ - గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే అందరికీ సమాన దూరంలో ఉంటుందన,ి జనాభాకూ మధ్యలో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అన్నీ విజయవాడ - గుంటూరు మధ్య ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందని, వీటిని విమానాశ్రయాలకు దగ్గరగా ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించిందని నారాయణ అన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరంలో, వ్యాపార రాజధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న విశాఖలో ఐఐఎంను, కాకినాడలో పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని, పశ్చిమ గోదావరిలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని, 13 జిల్లాలకూ కేంద్రం అయిన గుంటూరులో ఎయిమ్స్ను, విజయవాడలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, తిరుపతిలో ఐఐటీని, అనంతపురంలో ట్రిపుల్ ఐటీని, కర్నూలులో ఎన్ఐటీని ఏర్పాటు చేయాలని తాము భావిస్తున్నామని, బాగా వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఉద్యోగాలు రావాలని, అందుకోసం ఆయా జిల్లాల్లో పరిశ్రమల్ని బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు.