చంద్రబాబుకు కొత్త తలనొప్పి: ఫ్యాక్షన్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు
అమరావతి: తెలుగుదేశం పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరికతో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒకే ఒరలో చంద్రబాబు అతి బలవంతంగా ఇరికించిన రెండు కత్తుల మధ్య గొడవ మొదలైంది.
తనను ఎదుటివారు ఇబ్బంది పెడితే అందుకు రెట్టింపు ఇబ్బందులు తాను సృష్టిస్తానని ఇటీవల ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆదినారాయణ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో తిరిగి ఫ్యాక్షన్ను ప్రోత్సహించేలా ఆదినారాయణరెడ్డి మాట్లాడున్నారని మండిపడ్డారు.
మాటల్లో ఫ్యాషన్, చేతల్లో ఫ్యాక్షన్ అన్నట్టుగా ఆదినారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాటల్లో కాకుండా మనసులో కూడా మార్పు రావాలని ఆదినారాయణ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జమ్మలమడుగులో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉండడం వల్లే టీడీపీలోకి తాను ఆదినారాయణరెడ్డి రాకను వ్యతిరేకించాననని చెప్పారు.
అయినా సరే అధిష్టానం టీడీపీలోకి ఆదినారాయణరెడ్డిని చేర్చుకుందని పేర్కొన్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఆదినారాయణ రెడ్డితో కలిసి పనిచేసే పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదన్నారు. ఒకటి చేస్తే అందుకు బదులుగా రెండు చేస్తామని చెప్పి కార్యకర్తల్లో భయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే ఆ వ్యాఖ్యలకు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలతో జమ్మలమడుగులో ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంకా అగలేదని, లోలోపల రగులుతూనే ఉన్నాయని మరోసారి వెల్లడైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.