ఏపీలో మోగిన స్థానిక నగారా.. షెడ్యూల్ రిలీజ్, ఫిబ్రవరిలో ఎన్నికలు..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. అయితే ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గొడవ జరుగుతోంది. దీనిపై హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఇవాళ సీఎస్ ఆదిత్యనాథ్, ఇతర అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్తో చర్చలు జరిపారు.
4 దశల్లో ఎన్నికలు
ఆ చర్చలు సఫలీకృతం కాలేదు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ స్పష్టం చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం తమ నిర్ణయానికి కట్టుబట్టారు. సంచలనాత్మక రీతిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4వ తేదీన వరుసగా ఒక్కో దశకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వివరించారు.
Recommended Video
ఫిబ్రవరిలో ఎన్నికలు
ఫిబ్రవరి 5, 7, 9, 17న దశలవారీగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. చివరి దశ పోలింగ్ రోజునే సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ను సాకుగా చూపుతూ రాష్ట్ర సర్కారు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలనుకుంటోందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు.
అమెరికాలో నిర్వహించగా..
కరోనాతో తీవ్రస్థాయిలో ప్రభావితమైన అమెరికాలోనే ఎన్నికలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఏపీలో అంతటి దారుణమైన పరిస్థితులు లేవని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరపాలనే నిర్ణయం తీసుకునే ముందు తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని స్పష్టం చేశారు. ఏవైనా పథకాలు ప్రారంభించే ముందు ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.