బ్రిటీషువారికీ...బిజెపి ప్రభుత్వానికి తేడా లేదు;అది ప్రధానికి ఉండాల్సిన లక్షణమేనా?:చంద్రబాబు
అమరావతి:బ్రిటీషువారికీ...కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికీ, ఏ మాత్రం తేడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి ముంపుపై బాబు ఫైర్, 'ఏపీలో ముందస్తుపై జగన్కు హాట్లైన్లో బీజేపీ సమాచారం'
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. అమరావతి రాజధానిని ఢిల్లీ మించి నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని ఇప్పుడెందుకు సహకరించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఎపిని బానిసలు మాదిరిగా చూస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీవి మాటలే...చేతల్లేవ్:చంద్రబాబు;అధ్యక్షా!ఇందులో అవినీతి జరిగిందేమోనని అనుమానంగా ఉంది:ఎమ్మెల్యే
కేంద్రం,మోడీపై...చంద్రబాబు ఫైర్
అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశంపై సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ తీరును సిఎం చంద్రబాబు దుయ్యబట్టారు. పన్నెండేళ్లు గుజరాత్ సిఎంగా ఉన్న నరేంద్రమోడీ నాలెడ్జ్హబ్ గురించి ఏనాడు ఆలోచించలేదని, కనీసం ఇంజనీరింగ్ కళాశాలల్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. తాను గతంలో సిఎంగా ఉన్నప్పుడు 28 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశానన్నారు.
నిజాం నవాబు అది...నేను ఇది
చార్మినార్ను హైదరాబాద్లో నిజాం నవాబు నిర్మిస్తే తాను నాలెడ్జ్ ఎకానమీ నెలకొల్పానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మోడీ తమను బానిసలు మాదిరిగా చూస్తున్నారని చంద్రబాబు వాపోయారు. రాష్ట్ర పన్నుల కంటే కేంద్ర పన్నులు ఎక్కువగా తీసుకొంటున్నారని చెప్పారు. హైకోర్టు విభజన అంశంలోనూ కేంద్రం రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనకు పరిపక్వత లేదని, కేసిఆర్కు మాత్రమే ఉందని ప్రధాని ఏ విధంగా నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు. పీడీ అకౌంట్లు అంటే తెలియని వారు కూడా వాటిపై మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు.
ప్రధానికి...ఉండాల్సిన లక్షణమేనా?
నీతి అయోగ్ సిఫార్సు చేసినా రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు. పైగా యుసిలు ఇవ్వకుండా డబ్బులెలా ఇస్తారంటూ మోడీ ఎదురు ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు వాపోయారు. ఇది ఒక దేశ ప్రధానికి ఉండాల్సిన లక్షణమేనా అని ఆయన ప్రశ్నించారు. మోడీ ముంబయి, అహ్మదాబాద్, డోలెరా, గుజరాత్ను ఒకరకంగానూ, మిగిలిన రాష్ట్రాలను మరోరకంగా చూస్తున్నారన్నారు. రాజధాని మ్యాపులు ఇంకా సింగపూర్లోనే ఉన్నాయని అమిత్షా అంటున్నారని, ఆయనకు రాజధానిపై అవగాహనే లేదని చంద్రబాబు చెప్పారు.
ప్రపంచంలోనే...టాప్ 5 లో ఉంచుతా
ప్రపంచంలోని 5 ముఖ్య నగరాల్లో అమరావతిని మొదటిస్థానంలో నిలబెడతామని సిఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాగే తిరుపతి, విశాఖపట్నంను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామన్నారు. మొత్తం తొమ్మిది నగరాలు, 30 పార్కులు, 20 టౌన్ షిప్పులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని రూ. 48 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పటికి 59 శాతం పనులు ప్రారంభమయ్యాయని, మరో 30 శాతం పనులు టెండర్ల దశలో ఉన్నాయని చంద్రబాబు ఈ సందర్భంగా సభకు వివరించారు.