షర్మిల మళ్లీ వస్తారు: అంబటి, ఏం చేయలేం: టిపై పళ్లం
విజయవాడ: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం తెలిపారు. ఆయన కృష్ణా జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. వైయస్ జగన్, సోదరి షర్మిలల మధ్య విభేదాలు వచ్చాయని, దూరం పెరిగిందనే ప్రచారంపై స్పందించారు.
నాడు జగన్ జైల్లో ఉన్నారు కాబట్టి షర్మిల ప్రజల కోసం తమ పార్టీ తరఫున పాదయాత్ర చేశారన్నారు. అవసరమైనప్పుడు షర్మిల మళ్లీ ప్రజల మధ్యకు తప్పకుండా వస్తారని చెప్పారు. కుటుంబ సభ్యులను, నమ్మిన వారిని మోసం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిదేనని ఆరోపించారు.
జగన్, షర్మిలల మధ్య దూరం పెరిగిందని తప్పుడు ప్రచారం చేసి తమ పార్టీని ఎవరూ దెబ్బతీయలేరన్నారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ సీమాంధ్రలో 150, తెలంగాణలో 25 స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. అంబటి రాంబాబు నూజివీడులో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, ఆదివారం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం దేశవ్యాప్తంగా పర్యటించి నాయకులను కలుస్తుంటే, చంద్రబాబు మాత్రం మీడియా సమావేశాలకు పరిమితం అయ్యారని విమర్శించారు.
మేం నిస్సహాయులం: పళ్లం రాజు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నాయని కేంద్రమంత్రి పళ్లం రాజు బెంగళూరులో అన్నారు. ఈ పరిస్థితుల్లో తాను నిస్సహాయుడినని, ఒక పరిధి దాటి తాను వ్యతిరేకించలేనన్నారు. ప్రధానమంత్రి చెప్పడం వల్లనే తాను మంత్రిగా కొనసాగుతున్నానని తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ చాలా కీలకమైందన్నారు. ఆ శాఖ ఇబ్బంది పడకూడదని ప్రధాని చెప్పారని అందుకే పదవిలో కొనసాగుతున్నానని చెప్పారు.