2024లో పోటీపై తేల్చేసిన వంశీ : బాలయ్య - పురంధేశ్వరి సమాధానం చెప్పాలి..!!
2024 ఎన్నికల్లో పోటీ పైన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. అదే సమయంలో మంత్రులపైన జనసైనికుల దాడి..అన్ స్టాపబుల్ లో చంద్రబాబు - బాలయ్య వ్యాఖ్యల పైన వంశీ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు -పవన్ తోక పట్టుకొని ఈదాలనుకుంటున్నారని వంశీ వ్యాఖ్యానించారు. మంత్రుల పైన దాడిని ఆయన ఖండించారు. ఆరు శాతం ఓటింగ్ ఉన్న జనసేన దాడి చేస్తే.. 51 శాతం ఓటింగ్ ఉన్న వైసీపీ దాడి చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన కేడర్ ను అదుపులో పెట్టుకోవాలని వంశీ హెచ్చరించారు.

జూ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేసారు
జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ వాడుకొని వదిలేసిందని వ్యాఖ్యానించారు. రైతుల పాదయాత్రలో పెట్టుబడి దారులు ఉన్నారని విమర్శించారు. రైతులను బెదిరించి అసైన్డ్ భూములు లాక్కున్నారని..దీంతో, రైతుల యాత్రకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. తాజాగా.. అన్ స్టాపబుల్ కార్యక్రమంలో చంద్రబాబు - బాలయ్య నాటి ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటన పై చెప్పిన విషయాలతో వంశీ విభేదించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచానని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతితో కలిసి ప్రచారం చేసారని..ఆ ఎన్నికల్లో టీడీపీ - మిత్రపక్షాలకు కలిపి 262 సీట్లు వచ్చాయని గుర్తు చేసారు. వారిద్దరినీ ప్రజలు ఆదరించారని వంశీ పేర్కొన్నారు.

దగ్గుబాటి దంపతులు టీడీపీలో ఎందుకు లేరు
అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేసారని గుర్తు చేసారు. లక్ష్మీ పార్వతి కారణంగానే నాడు ఆ నిర్ణయం పార్టీ భవిష్యత్ కోసం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్న వారు సమాధానం చెప్పాలంటూ వంశీ ప్రశ్నలు సంధించారు. టీడీపీ రక్షించటం కోసమే అయితే.. హరికృష్ణ వేరే పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నారు. అదే విధంగా దగ్గుబాటి వేంకటేశ్వర రావు ఒక పార్టీలోకి.. పురంధేశ్వరి మరో పార్టీలోకి ఎందుకు వెళ్లారని వంశీ ప్రశ్నించారు. టీడీపీని రక్షించటం కోసం దగ్గుబాటి దంపతులు వేరే పార్టీకి వెళ్లారా అని నిలదీసారు. బాలకృష్ణ అప్పటి వరకు పార్టీలోనే ఉన్నా..పార్టీ వ్యవహారాలకు ఎందుకు దూరమయ్యారో చెప్పాలన్నారు.

గన్నవరం వైసీపీ అభ్యర్ధి నేనే
ప్రజలు నమ్మటం లేదనే ఇటవుంటి ఎంటర్ టైన్ మెంట్ వేదిక ద్వారా వివరణ ఇచ్చుకుంటున్నారని వంశీ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో గన్నవరం వైసీపీ అభ్యర్ధిగా తానే పోటీ చేస్తానని వంశీ స్పష్టం చేసారు. తాను టీడీపీలో ఉన్న సమయంలోనూ మూడు - నాలుగు గ్రూపులు ఉండేవన్నారు. ఇప్పుడు తన కంటే ముందు నుంచి వైసీపీలో ఉన్నవారు ఉన్నారని..వారిని కలుపుకొని వెళ్తానని చెప్పుకొచ్చారు. తన పోటీ పైన పార్టీలో ఎవరికైనా అనుమానం ఉంటే..వైసీపీ అధినాయకత్వంతో మాట్లాడవచ్చని వంశీ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications