10లోగా టి బిల్లుపై అభిప్రాయం చెప్పాలి, కండిషన్స్ అప్లై
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అభిప్రాయం మాత్రమే తీసుకుంటామని సభాపతి నాదెండ్ల మనోహర్ సోమవారం చెప్పారు. బిల్లులోని సవరణల పైన మాత్రమే ఓటింగ్ ఉంటుందన్నారు. జనవరి 10వ తేదీలోగా (శుక్రవారంలోగా) సభ్యులు సవరణ ప్రతిపాదనలను ఇవ్వాలని బిఏసిలో సూచించారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట లోగా క్లాజులవారీగా సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు.
సభ్యులు తమ అభిప్రాయాన్ని తెల్ల కాగితంపై రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలన్నారు. ఎలాంటి అఫిడవిట్లు, లెటర్ హెడ్స్ను తీసుకోమన్నారు. సభ్యులకు ఫార్మెట్ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. మూడు రాష్ట్రాల అధ్యయనంలో ఇదే తేలిందని చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో సభాపతి నాదెండ్ల ఇటీవల ఉత్తర ప్రదేశ్, బీహార్ వెళ్లి పదమూడేళ్ల క్రితం ఏర్పడ్డ కొత్త రాష్ట్రాలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ అసమర్థత వల్లే: యనమల
ప్రభుత్వం అసమర్థత వల్లే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఇప్పటి వరకు చర్చ జరగలేదని తెలుగుదేశం పార్టీ మండలి నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బిల్లుపై సభ్యులకు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. చర్చించేందుకు రాష్ట్రపతిని అదనపు సమయం కోరే అవకాశముందన్నారు.
ఉభయ సభలు వాయిదా
శాసన సభ, మండలిలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. రెండు గంటలకు సమావేశమైన శాసన సభలో తిరిగి అదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. పోడియం వద్ద ఇరు ప్రాంతాల సభ్యులు ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు.