1.. 2 కాదు.. 23, టీడీపీతో దోస్తీయా...: చంద్రబాబు 'దోస్తీ' ఆఫర్కు వైసీపీ తిరస్కరణ!
న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి వస్తే తప్పులేదని, లోకసభ ఎన్నికల తర్వాత ఆయనకు ఒకటో రెండో సీట్లు వస్తాయని, అలాంటప్పుడు ఆయన కూడా మద్దతిస్తే తప్పేమీ కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలవాలన్నారు. దీనిపై వైసీపీ కేడర్ తీవ్రంగానే స్పందిస్తోంది.
చంద్రబాబు ఏం చెప్పారంటే
ఆయన ఓ జాతీయ టీవీ ఛానల్తో మాట్లాడారు. మీరు జగన్మోహన్ రెడ్డిని స్వాగతిస్తారా అని ప్రశ్నించగా.. చంద్రబాబు స్పందిస్తూ.. దేశం కోసం ఆలోచించే వారు ఎవరైనా రావొచ్చునని చెప్పారు. ఎవరైనా రావొచ్చునని చంద్రబాబు చెప్పగా.. సదరు జర్నలిస్ట్ సూటిగా మరోసారి ప్రశ్న అడుగుతున్నానని, లోకసభ ఎన్నికల తర్వాత కూడా మీరు వైసీపీని స్వాగతిస్తున్నారా అని ప్రశ్నించారు. దానిపై చంద్రబాబు స్పందిస్తూ... ఎన్నికల తర్వాత జగన్కు ఒకటో, రెండో సీట్లు వస్తాయని, ఆయన వచ్చి మద్దతివ్వవచ్చునని, అందులో తప్పేమీ లేదన్నారు.
మాకు 2, 3 సీట్లు కాదు 23 సీట్లు
దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేడర్ తీవ్రంగానే స్పందిస్తోంది. ఓ వైపు జాతీయ సర్వేలు వచ్చే లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ 19 నుంచి 23 లోకసభ స్థానాలు గెలుచుకుంటుందని చెబుతున్నాయని, ఢిల్లీ వేదికగా చంద్రబాబు మాత్రం తమకు ఏదో ఒకటి రెండు సీట్లు వస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తాము అధికారం చేపడతామని, అలాగే ఇరవైకి పైగా లోకసభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు ఒకటి రెండు సీట్లు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారని కానీ టీడీపీకే వస్తాయన్నారు.
టీడీపీతో కలవడమా?
అదే సమయంలో, చంద్రబాబు నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగారని, కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇప్పుడు దీక్షలు, ధర్నాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, అలాంటి టీడీపీకి తాము మద్దతివ్వడం ఏమిటని అంటున్నారు. కొత్త రాష్ట్రమైన ఏపీకి లబ్ధి చేకూరుతుందని నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉండి, ఆ పార్టీని ఆకాశానికి ఎత్తి, ఇప్పుడు ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్న టీడీపీతో తాము కలవడం ఏమిటని అంటున్నారు.