డ్రా చేసిన డబ్బు నిర్మాత ఇంటికి: రేవంత్ విచారణ తర్వాతే బాబుకు నోటీసు?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలను ఎన్టీర్ ట్రస్టు భవన్ సమీపంలోని ఓ బ్యాంక్ నుంచి డ్రా చేసినట్లు బయటపడిందని మీడియా కథనాలు వస్తున్నాయి.
బ్యాంక్ నుంచి డ్రా చేసిన తర్వాత ఆ సొమ్మును ఓ సినీ నిర్మాత ఇంటికి చేర్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఆ డబ్బు ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు, ఆ ఖాతాదారునికి టిడిపితో ఉన్న సంబంధాలు, ఆ డబ్బును సినీ నిర్మాత ఇంటికి ఎవరు చేర్చారు, బ్యాంకు నుంచి రూ.2.5 కోట్లు డ్రా చేయగా, మిగతా రూ.2 కోట్ల రూపాయలను ఎక్కడ దాచారు అనే విషయాలపై అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేకు అడ్వాన్సుగా 50 లక్షల రూపాయలేసి ఇవ్వడానికి ఆ సొమ్మును డ్రా చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సొమ్ముపై ఆరా తీయడానికి, మరిన్ని విషయాలను రాబట్టడానికి రేవంత్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఎసిబి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఎసిబి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసింది.
అయితే, చంద్రబాబు స్వయంగా స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడినట్లు ఆధారాలున్నాయని అంటున్నారు. అయితే, చంద్రబాబు విషయంలో తొందర పడకూడదని ఎసిబి భావిస్తోంది. రేవంత్ రెడ్డిని, ఇతర నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని ఎసిబి అనుకుంటున్నట్లు మీడియాలో శుక్రవారంనాడు వార్తలు వచ్చాయి.