ఏపీలో వైసీపీకి కూడా టీడీపీ గతే పడుతుంది..! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సంచలన వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు. నిన్నటి వరకు వైసీపీ విషయంలో పెద్దగా నోరు విప్పని బీజేపీ నేతలు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని ఏపీ బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా దాడులేనని ఆయన విమర్శలు గుప్పించారు.
టీడీపీ బాటలో పయనిస్తున్న వైసీపీ .. భవిష్యత్ లో టీడీపీకి పట్టిన గతే పడుతుందన్న బీజేపీ నేత కన్నా
గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి అరాచకాలకే పాల్పడిందని పేర్కొన్న కన్నా ఇప్పుడు వైసీపీ కూడా అదేబాటలో పయనిస్తోందని మండిపాటుకు గురయ్యారు . పద్దతి మార్చుకోకపోతే టీడీపీకి పట్టిన గతే పడుతోందని కన్నా హెచ్చరించారు. 2014 తర్వాత టీడీపీ ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో ఇప్పుడు వైసీపీ కూడా అలాగే అరాచకాలకు పాల్పడుతుంది అని ఆయన పేర్కొన్నారు . ఇక ఏపీ ప్రజలు మెచ్చి ఒక అవకాశం ఇచ్చారని, దాన్ని వైసీపీ నిలబెట్టుకోవాలని కన్నా హితవు పలికారు . గుంటూరు జిల్లా దాచేపల్లిలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. అయితే కార్యకర్తలు జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రెండు మూడు గ్రామాల్లో వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని కన్నా ఆరోపించారు.
Recommended Video
బీజేపీ జెండా గద్దెలను కూల్చేయటం , కార్యకర్తలపై దాడులు చెయ్యటం హేయమైన చర్య అన్న బీజేపీ నేత కన్నా
గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో బీజేపీ జెండాగద్దెలను వైసీపీ నేతలు కూల్చివేస్తున్నారని తెలిసిందని అది సరికాదన్నారు. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోబోమని వైసీపీని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు, దాడులు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు కన్నా .ఇకనైనా వైసీపీ నేతలు పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. అధికారంతో మంచి పనులు చేసి ప్రజల అభిమానం సంపాదించుకోవాలన్నారు. అంతేకానీ కక్ష సాధింపులు ఉండకూడదని అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.
వైసీపీపై మొదలైన వ్యతిరేకత .. జగన్ పాలనపై దృష్టి పెట్టకుంటే కష్టమే .
మొత్తానికి ఏపీలో జగన్ మీద అటు టీడీపీ నే కాదు , ఇటు బీజేపీ కూడా నిదానంగా గొంతు విప్పుతోంది. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని చెప్తున్నారు. ఇక ప్రజల నుండి , ముఖ్యంగా రైతుల నుండి విత్తనాల సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. వైసీపీ పాలనపై దృష్టి పెడితే బాగుంటుంది అనే భావన రాజకీయ వర్గాల్లో సైతం వ్యక్తం అవుతుంది. అరాచకాలు, దాడులు పెరిగిపోయిన తరుణంలో దీనికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే .