చంద్రబాబు భద్రతపై ఢిల్లీకి నివేదిక పంపించిన NSG
చంద్రబాబునాయుడు సభ పెట్టుకుంటే నిబంధనలమేరకు చర్యలు తీసుకుంటే సరిపోయేదని, అలా కాకుండా పోలీసులే రోడ్డుకు అడ్డంగా బైఠాయించడం వివాదాస్పదంగా మారింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవలే ఉద్రిక్త పరిస్థితుల మధ్య తూర్పుగోదావరి జిల్లా పర్యటన పూర్తిచేసుకున్నారు. అనపర్తి సభ కోసం పోలీసులు అనుమతించలేదని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబు చీకట్లో సెల్ ఫోన్ల వెలుగులో నడవడం అంటే సాహసమే. చంద్రబాబు చుట్టూ ఎన్ఎస్ జీ దళం ఉన్నా ఆయనకు ముప్పుందంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
అనపర్తి నుంచి కాలినడకన రావడంతోపాటు ఆయన సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించడంతోపాటు అడ్డంగా బైఠాయించడంలాంటివన్నీ కలిపి ఒక నివేదికను తయారుచేసిన ఎన్ఎస్ జీ ఢిల్లీకి వివరాలు పంపించింది. ఇటీవలే చంద్రబాబుకు ముప్పుందనే అనుమానంతో సెక్యూరిటీని పెంచారు. అయితే పోలీసులే అడ్డుకోవడాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్ ఎస్ జీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఈ ఘటనలో పోలీసుల పాత్రమీదే ఎక్కువ చర్చ నడుస్తోంది. చంద్రబాబునాయుడు సభ పెట్టుకుంటే నిబంధనలమేరకు చర్యలు తీసుకుంటే సరిపోయేదని, అలా కాకుండా వీరే రోడ్డుకు అడ్డంగా బైఠాయించడం వివాదాస్పదంగా మారింది. పోలీసులు అంత పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.ఇప్పటికే ప్రతిపక్షాలను నిర్బంధించడంవల్ల మరింత సానుభూతి వస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివారు చెబుతున్నారు. దీనిపై జనసేనాని కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘురామ రాసిన లేఖకు కేంద్రం ఏ విధంగా స్పందిస్తోంది అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఏపీ బీజేపీ నేతలు ఎవరూ దీనిపై స్పందించలేదు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇంతవరకు పెదవి విప్పలేదు. రెండు పార్టీల మధ్య జరిగిన వివాదంగానే కేంద్రం చూస్తుందా? లేదంటే వివరాలన్నింటినీ తెప్పించుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications