కొత్త పెన్షన్ దరఖాస్తు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ముహూర్తం..!!
ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పై కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ పెంపుతో పాటుగా ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటి వద్ద పంపిణీ చేస్తోంది. కొత్త పెన్షన్ల కోసం వస్తున్న వినతులతో తాజా గా ప్రభుత్వం కొత్త దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను పరిశీలించన తరువాత అర్హులకు దశల వారీగా పెన్షన్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. కాగా.. ఇప్పుడు తీసుకున్న మరో నిర్ణయం దరఖాస్తు దారులకు వెసులుబాటుగా మారనుంది.
కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులకు గడువుగా నిర్ణయించింది. దీంతో.. పెన్షన్ల కోసం నిరీక్షిస్తున్న వారు తమ వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు అందిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఈ గడువు మరో రెండు రోజుల పాటు పొడిగిస్తూ.. దరఖాస్తుల స్వీకరణ 18వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటన చేసింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మరో రెండు రోజులు సమయం పెంచినట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ఉన్న పింఛన్లకు దరఖాస్తు గడువును ఇప్పుడు సెప్టెంబర్ 18 వరకు పొడిగించినట్లు చె్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో
కాగా.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు స్థానిక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల వద్ద దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత సచివాలయ సిబ్బంది దరఖాస్తు దారులకు రసీదు ఇస్తున్నారు. అందులో ఉండే నెంబర్ ద్వారా తమ దరఖాస్తు పరిస్థితి తెలిసే అవకాశం కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సుమారు 62 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని మంత్రి తెలిపారు. అయితే ఏదైనా కేటగిరీలో అర్హత ఉండి ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు ఈ పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. కాగా.. ప్రభుత్వం పరిశీలన తరువాత... పెన్షన్ కు అర్హత పొందిన వారికి దశల వారీగా పెన్షన్ పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దసరా నుంచి కొత్త పెన్షన్లు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
