'ఎంజీఆర్ కంటే ఎందులో తక్కువ, ఎన్టీఆర్ బతికుంటే ప్రధాని అయ్యేవారు'
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు మృతి చెందకపోతే ప్రధానమంత్రి అయ్యేవారని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్ నారాయణ మూర్తి ఆదివారం అన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. వారికి భారతరత్న ఇచ్చి మనవాళ్లకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఎందుకు ఇవ్వలేదన్నారు. లతా మంగేష్కర్ వంటి వారు అంటే గౌరవమని, కానీ మన సుశీలమ్మకు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు.
పద్మశ్రీ, భారతరత్న సహా అన్నింటా లాబియింగ్ బాధాకరమని ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఆర్ కాలం తమిళనాడుకే పరిమితమని, ఎన్టీఆర్ మాత్రం దేశ నాయకుడన్నారు. ఆయన ముందే చనిపోకుంటే ప్రధాని అయ్యేవారన్నారు.
కాగా, స్వర్గీయ నందమూరి తారక రామారావు చనిపోకపోయి ఉంటే ఆయన ప్రధాని అయ్యేవారని తెలుగు తమ్ముళ్లు కూడా భావిస్తారు. ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి నోట అవే వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ గత కొద్దికాలంగా ఉన్న విషయం తెలిసిందే.