పెద్దాయన వేడుకోలు:‘రూ. 2వేల నోట్లు వద్దండి-వంద నోట్లిచ్చి పుణ్యం కట్టుకోండి’
విజయవాడ: రూ. 500, 1000 నోట్ల రద్దుతో ప్రజలు తమ అవసరాల కోసం నోట్లను మార్చుకునేందుకు తెల్లవారుజామునే బ్యాంకులకు బయల్దేరుతున్నారు. అయితే, అక్కడ ఎక్కువ మందికి రూ. 500, 100 నోట్లు ఇవ్వకపోడంతో మళ్లీ ఇబ్బందులు తప్పడం లేదు. రూ. 2వేల నోటు ఇస్తే బయట ఎక్కడా? చిల్లర దొరకడం లేదని పలువురు వాపోతున్నారు.
కాగా, తనకు రూ. 2 వేల నోట్లు అక్కర్లేదని, వంద నోట్లిచ్చి పుణ్యం కట్టుకోవాలని ఓ పెద్దాయిన వేడుకున్నారు. గురువారం ఉదయం విజయవాడలోని ఓ బ్యాంకుకు రూ. 4,500ల పాత కరెన్సీని మార్చుకునేందుకు ఓ వయోవృద్ధుడు వచ్చాడు. అయితే, తనకు రూ. 2 వేల నోట్లను ఇవ్వబోగా.. 'వీటిని ఎవరూ తీసుకోవడం లేదటగా. నాకెందుకు బాబూ? వంద నోట్లివ్వండి చాలు' అని వేడుకున్నాడు.

అయితే, ఈ దృశ్యాలను అక్కడే ఉన్న మీడియా చిత్రీకరిస్తుండటంతో, బ్యాంకు సిబ్బంది అతనికి రూ. 100 నోట్లను ఇచ్చి పంపారు. బయటికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. తాను ఉదయం నుంచి బ్యాంకు దగ్గరే ఉన్నానని, మూడు గంటల పాటు నిలబడితే, ఈ డబ్బులు దొరికాయని చెప్పాడు.
ఈ డబ్బును తమ పొలంలో పనిచేస్తున్న కూలీలకు పంచాల్సి వుందని ఆయన చెప్పాడు. తనకు ఇంకా డబ్బు కావాలని, మరోసారి వచ్చి పాత నోట్లను మార్చుకోవాల్సి వుందని, శుక్రవారం మరోసారి తిరిగి వస్తానని తెలిపాడు.












Click it and Unblock the Notifications