ఆ రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. సెలవురోజు కావడం వల్ల శనివారం నాడు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. నేడు కూడా రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు భక్తల సంఖ్య కొంతమేర తగ్గినప్పటికీ.. మళ్లీ పుంజుకొంది.
శనివారం 77,807 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 38,340 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.02 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లూ నిండిపోయాయి. భక్తులతో కిటకిటలాడాయి. ఏటీజీహెచ్ సర్కిల్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.
శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పౌర్ణమి గరుడసేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.












Click it and Unblock the Notifications