జగన్ రోడ్ షోతో ట్రాఫిక్, వ్యక్తి మృతి! కర్నూల్లో మరదలిని ఎత్తుకెళ్లిన బావ
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు షో సందర్భంగా ఓ విషాదం చోటు చేసుకుంది. జగన్ రోడ్డు షో వల్ల అరగంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి, దీంతో ఓ అంబులెన్సులోని రోగి మృతి చెందాడని సమాచారం.
జగన్ రోడ్డు షో అనంతపురం జిల్లాలోని కూడేరులో సాగుతోంది. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనాలు నిలిచిపోయాయి. ఆ ట్రాఫిక్ జాంలో ఓ అంబులెన్స్ కూడా నిలిచిపోయింది. దీంతో అందులోని రోగి మృతి చెందాడు. అతను కణేకల్ మండలం హనుమాపురంకు చెందిన పాపన్నగా తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో మరదలిని ఎత్తుకెళ్లిన బావ
కర్నూలు జిల్లాలో ఓ బావ తన మరదలిని ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఆమెకు మరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో బావ ఆమెను ఎత్తుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
యువతి కొడుమూరుకు చెందినదిగా తెలుస్తోంది. ఓ వ్యక్తితో పెళ్లి కుదరడంతో వెంటి ఆభరణాలు కొనేందుకు ఆమె గోనెగొండ్లకు వచ్చింది. అక్కడి నుండి బావ ఆమెను ఎత్తుకెళ్లాడు. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.