జమిలి బిల్లులోని లా పాయింట్ వివరించిన సాయిరెడ్డి
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్పై కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఈ ఎన్నికల ముసాయిదా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కోవింద్ ఛైర్మన్గా వ్యవహరించిన ఈ కమిటీలో మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, రాజ్యసభ మాజీ సభ్యుడు గులాంనబీ ఆజాద్, లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ ఇదివరకే తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది కూడా. దీనిపై తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే ముసాయిదా బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభలో ప్రవేశ పెట్టబోతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో దీన్ని సభలో టేబుల్ చేయడానికి లైన్ క్లియర్ అయింది.
ఈ పరిణామాలపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడారు. 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని పునరుద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఏడాదే ఎన్నికలు ఉంటాయని తేల్చి చెప్పారు. అధికార భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ సంకీర్ణ కూటమి గెలిచే అవకాశాలు లేకపోతే తప్ప ఎన్నికలు వాయిదా పడబోవని అన్నారు.
విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడారు. జమిలి ఎన్నికలు సహా పలు అంశాలను ప్రస్తావించారు.
ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందనే పాయింట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులో స్పష్టంగా పొందుపరిచారని సాయిరెడ్డి వివరించారు. ఎన్నికల వాతావరణం తమకు అనుకూలంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకుంటుందే తప్ప 2027లో జమిలి నిర్వహించాలని ఇదివరకే నిర్ణయం తీసుకుందని అన్నారు.
సాధారణంగా ఆ ఏడాది జూన్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, తన అంచనా ప్రకారం సెప్టెంబర్లో ఉండొచ్చని పేర్కొన్నారు సాయిరెడ్డి. 2027లో జమిలి ఎన్నికలకు మాత్రం అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తమ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందనే మాట వాస్తవమేనని అంగీకరించారు. వైఎస్ఆర్సీపీకి బలం నాయకులు కాదు..కార్యకర్తలనని తేల్చి చెప్పారు. కలసికట్టుగా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామని, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని, కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు.












Click it and Unblock the Notifications