రివర్స్: ఓయులో కెసిఆర్కు చేదు, 20ని.హెలికాప్టర్లోనే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేదు అనుభవం ఎదురయింది. విద్యార్థులు కెసిఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన ఓయులోనే కెసిఆర్కు నిరసన సెగ తగలడం మింగుడు పడని విషయం.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమమబ్ధీకరిస్తామన్న కెసిఆర్ వ్యాఖ్యల పైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కెసిఆర్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు. దీంతో ఆయన హెలికాప్టర్ దిగకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. చిలకలగూడలో ఆదివారం సాయంత్రం జరగాల్సిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన హెలికాప్టర్లో ఓయుకు వచ్చారు.
అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గాన చిలకలగూడ వెళ్లాల్సి ఉంది. అయితే కెసిఆర్ రాక గురించి తెలిసిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో మైదానం వద్దకు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు గ్రౌండ్ లోపలకు వెళ్లకుండా గేట్లు మూశారు.
కెసిఆర్ హెలికాప్టర్ రాగానే విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పైన ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. విద్యార్థులతో మాట్లాడేందుకు ఆయన సుమారు ఇరవై నిమిషాల పాటు చూసినా.. వారు శాంతించలేదు. దీంతో ఆయన వెనుదిరిగారు.