జగన్! పిచ్చిగా మాట్లాడొద్దు: పరిటాల సునీత ఫైర్, జైలు తప్పదని వర్ల
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురం రాణినగర్లో ప్రతిపక్ష నేత హోదాను మరిచి రోడ్లపై పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ విజ్ఞత కోల్పోయాడని అన్నారు. నవనిర్మాణ దీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబును పరుష పదజాలంతో దూషించడాన్ని మంత్రి సునీత తీవ్రంగా ఖండించారు. ఇది ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు
ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిని దుర్భాషలాడటం సరికాదని సునీత అన్నారు. రోడ్లుపై ఏది పడితే అది మాట్లాడి ప్రజల్లో ఆయనే చులకన అవుతారని మంత్రి హితవు పలికారు. కాగా, జగన్ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.
త్వరలో జగన్ కు జైలుజీవితం తప్పదు:వర్ల రామయ్య
విజయవాడ: వైయస్సార్ కాంగ్రె సార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంస్కార హీనుడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ను చూస్తే అతని తల్లిదండ్రుల పెంపకం ఏంటో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో జగన్కు జైలు జీవితం తప్పదని వర్ల రామయ్య చెప్పారు.
మాతోనే హోదా సాధ్యం: రఘువీరా
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కదిరి పట్టణంలోని దాదా ఫంక్షన్ హాలులో గురువారం కాంగ్రెస్ జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం, అభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
కాంగ్రెస్ విభజన చేయటంతోనే రాష్ట్రంలోని పరిస్థితులకు కారణమని ఆరోపించటం సరికాదన్నారు. అన్ని పార్టీల అంగీకారంతోనే విభజన జరిగిందని, ఆ సమయంలో రాష్ట్రానికి హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు, లోటు బడ్జెట్కు ప్రత్యేక నిధులు ఇచ్చేలా చట్టంలో చూపామన్నారు.
చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి క్షుద్రరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా 2019లో రాహుల్ ప్రధాని కాకుండా అడ్డుకోలేరని, పదవుల కోసం కాకుండా దేశం కోసం ప్రియాంకను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వికాస్పర్వ, నవనిర్మాణ దీక్షలు ఏం చూపి చేస్తున్నారని ప్రశ్నించారు.