ఏపీలో ఆ పార్టీకే భారీ ఆధిక్యత- అక్కడే ట్విస్ట్: ఆందోళన కలిగించే సెఫాలజిస్ట్ లేటెస్ట్ సర్వే
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలవుతున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. కిందటి నెల 27వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ఆరంభమైన ఈ బస్సు యాత్ర నేటికి 10వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.

అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా గళం పేరుతో ప్రచార సభల్లో పాల్గొంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. రోడ్ షోలతో జనంలోకి దూసుకెళ్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య- ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థా దాస్.. ఏపీ ఎన్నికలపై నిర్వహించిన సర్వే వీడియోను విడుదల చేశారు. వాటి ఫలితాలను వెల్లడించారు. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందనేది వివరించారు.
తాము ప్రతి రోజూ అన్ని నియోజకవర్గాల్లో సర్వేలను నిర్వహిస్తోన్నామని, 500-600 వరకు శాంపిళ్లను సేకరిస్తోన్నామని పార్థాదాస్ పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ఓటుబ్యాంక్ పెరుగుతోందని తేల్చి చెప్పారు. కొన్ని జిల్లాల్లో 1.5 శాతం నుంచి 2 శాతం వరకు కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఉంటోందని, గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు.
పెరుగుతున్న కాంగ్రెస్ ఓటుబ్యాంకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని పార్థా దాస్ అంచనా వేశారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పూర్తి ఆధిపత్యాన్ని కనపరుస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళా ఓటుబ్యాంకు పూర్తిగా మద్దతు ఇస్తోందని పార్థాదాస్ తెలిపారు. ప్రతి వంద మంది మహిళల్లో 54 నుంచి 56 శాతం మంది వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయడానికే మొగ్గు చూపుతున్నారని వివరించారు. ఇది వైఎస్ఆర్సీపీకి అన్ని రకాలుగా అధికారానికి చేరువ చేయగలదని పేర్కొన్నారు.

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉందని పార్థా దాస్ వివరించారు. వరంగల్, ఖమ్మం, భువనగిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ కూడా మహిళా ఓటుబ్యాంకు అధికార పార్టీ వైపే ఉందని పేర్కొన్నారు.
మెజారిటీ లోక్సభ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుందని తెలిపారు. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి ఈ లోక్సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చని పార్ధా దాస్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను కనపర్చే అవకాశాలు ఉన్నట్లు చెప్పారాయన.
పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి గట్టిపట్టు ఉందని, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపుతున్నట్లు వివరించారు. ఆదిలాబాద్, కరీంనగర్ లోక్సభ పరిధిలో బీజేపీ బలంగా ఉందని పార్థాదాస్ పేర్కొన్నారు. 4 నుంచి 6 స్థానాలను బీజేపీ గెలుచుకోవచ్చని చెప్పారు.












Click it and Unblock the Notifications