దగ్ధం చేయాల్సింది మోడీ దిష్టిబొమ్మలను కాదు, వైఎస్ దిష్టిబొమ్మలను: పత్తిపాటి
గుంటూరు: దగ్ధం చేయాల్సింది ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను కాదు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మలను తగులబెట్టాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్రం, రాష్ట్రం మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు చూస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రధాని ప్రసంగాన్ని నిరసిస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆప్పుడు విభజన చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు పొందుపర్చలేదని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఆయన నిలదీశారు. ఏదైనా సాధించే శక్తి చంద్రబాబు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అమరావతి శంకుస్థాపన రోజు ప్రధాని మోడీ హోదా లేదా ప్యాకేజి ప్రకటిస్తారని ఎవరైనా చెప్పారా? మంత్రి ప్రశ్నించారు.
విభజన చట్టంలోని హామీలను మోడీ ఖచ్చితంగా అమలు చేస్తామన్నారని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టారని ధ్వజమెత్తారు. ముఖం చెల్లక శంకుస్థానకు రాలేదని దుయ్యబట్టారు. విపక్షనేతలకు చిత్తశుద్ధి ఉంటే శంకుస్థాపనకు వచ్చి ఈ విషయాన్ని ప్రధాని మోడీని ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడానికి ప్రతిపక్షాల కార్యకర్తలు ప్రయత్నించారు. వామపక్షాలు జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాయి.