జనసేన దూకుడు రాజకీయాలు..! ప్రజల పక్షాన పోరాడేందుకు వినూత్న పోరాటాలు..!!
అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. రాజకీయ నేతలు కూడా కాస్త రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. ప్రజలు మాత్రం ఏదో ఒక సమస్యతో ఇబ్బందులకు గురౌతూనే ఉన్నారు. అలాంటి ఇబ్బందుల నుండి జనాన్ని కాపాడేందుకు జనసేన ప్రణాళికలు రచిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని జనసేన నిర్ణియించుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసం వినూత్న కార్యాచరణ రూపొందిస్తున్నారు ఆ పార్టీ అదినేత పవన్ కళ్యాణ్.
అమరావతి రాజకీయాల్లో ఆక్టీవ్ గా ఉండాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడుతూ ప్రతిపక్ష పార్టీ హోదాను నిర్వీర్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపిలను ప్రజలు అంతగా ఆదరించకపోడంతో, ప్రతిపక్ష పార్టీకి ప్రత్యమ్నాయంగా జనసేన పేరు వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఏపి రాజకీయాల్లో పవన్ ప్రతాపం.. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించేందుకు సిద్దం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లో చురుకైనా పాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్నారు. సమకాలీన రాజకీయాల్లో ప్రజల పక్షాణ గొంతు వినిపించేందుకు దృష్టి సారించారు. తాను చేస్తున్న పోరాటాలకు ఓలెక్కుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రాబోవు సాధారణ ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న రాజకీయాల పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు జనసేనాని.

ప్రజా సమస్యలే ఎజెండా.. మరో సారి ప్రజా బాట పట్లనున్న పవన్ కళ్యాణ్..
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఇసుక ర్యాలీతో వైసీపీ ప్రభుత్వంలో కదలిక వచ్చిందని జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లు బలమైన పార్టీలు అయినప్పటికీ వైసీపీ పార్టీని ధీటుగా ఎదుర్కోవటంలో వెనుకంజ వేస్తున్నాయి. పాత తప్పిదాలు, అవినీతి కేసులు బయటకు వస్తాయనే భయం కూడా చాలామంది నేతలను వెంటాడుతుండడంతో ప్రజాపోరాటాలకు జంకుతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి కీలకమైన సమయంలో, జనసేన జెండానే ప్రజల ఎజెండాగా జనం మధ్యకు వెళ్లాలని జనసేనాని కార్యచరణ రూపొందిస్తున్నారు.

ఇసుక కొరత ఇంకెన్నాళ్లంటున్న పవన్.. భవన నిర్మిణ కార్మికుల తరుపున పవన్ పోరాటం..
అంతే కాకుండా మెగాఫ్యాన్స్, కాపులు, జనసేన కార్యకర్తలు మూడు వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావటం ద్వారా తాము అనుకున్నది సాధించవచ్చనేది పవన్ కళ్యాణ్ ప్రణాళికగా తెలుస్తోంది. ఇటీవల ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా సంయమనం పాటించారు. సమయస్పూర్తితో ఏపి సీఎం చేసిన విమర్శలను హుందాగా తిప్పికొట్టారు. తద్వారా తాను వ్యక్తిగత కోపతాపాలకు అతీతుడిననే సంకేతాలు ఇవ్వడంతో పాటు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే తన ముందున్న లక్ష్యమని చెప్పే ప్రయత్నం చేసారు.

ఇంగ్లీషు భాషపై ఆరాటం.. గతి తప్పుతున్న పోరాటం..
ఏపీలో ఇసుక సమస్య, ఇంగ్లిషు మీడియం చదువులు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం, రివర్స్ టెండరింగ్, అవినీత తదితర అంశాలపై జనసేన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పాలనా విధానంలో జరుగుతున్న పొరపాట్లను కూడా ఎలుగెత్తి చాటాలని జనసేన కృతనిశ్ఛయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా విపక్షాలను బలహీనపరచాలనే వ్యూహంతో వైయస్సార్ సీపీ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం పోలీసులు, కోర్టులంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరతీసినట్టు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి కేసుల్లో భాగస్వామ్యం లేకుండా, క్రిష్టల్ క్లియర్ గా ఉన్న జనసేన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వం పైన దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications