పవన్ గురి 'ఒంగోలు'పై: బహిరంగ సభ.. ఏ సమస్యపై గొంతెత్తనున్నారు?
పవన్ కళ్యాణ్ తదుపరి బహిరంగ సభకు ఒంగోలు వేదికగా కాబోతోంది అన్న వార్త ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా దగ్గరి నుంచి.. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల దాకా తన దృష్టికి వచ్చే ప్రతీ సమస్యపై ఆయన గొంతెత్తుతున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ప్రత్యేక హోదా అంశంపై తిరుపతి, కాకినాడల్లో బహిరంగ సభ నిర్వహించారు పవన్. ఆ తర్వాత రాయలసీమ కరువు సమస్యలపై అనంతపురం బహిరంగ సభ ద్వారా స్పందించారు. అలాగే పశ్చిమగోదావరిలోని మెగా ఫుడ్ పార్క్ సమస్యపై.. మొన్నీమధ్యే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై నేరుగా జనంలోకి వెళ్లి ఆయన స్పందించిన సంగతి తెలిసిందే.
ఇక ఆయన తదుపరి బహిరంగ సభకు ఒంగోలు వేదికగా కాబోతోంది అన్న వార్త ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందుకోసం జనసేన కార్యకర్తలు ఇప్పటికే జనంలోకి వెళ్లి.. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒంగోలులో నెలకొన్న ప్రధాన సమస్యలపై పవన్ ఈ సభలో ప్రస్తావించే అవకాశం ఉంది.
జనవరి చివరి వారంలో ఈ సభ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, జిల్లాకో బహిరంగ సభ ద్వారా ఆయన తన పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు ఆయా సమస్యలపై జనసేన నిరంతరం గొంతెత్తడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్టుగా సమాచారం.
కాగా, ఇప్పటిదాకా ప్రత్యేక హోదా, కరువు, మెగా ఫుడ్ పార్క్, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించిన పవన్.. ఒంగోలు వేదికగా ఏ సమస్యను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. మరో కొద్దిరోజుల్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.