మౌనిక ప్రకటించిన 3 రోజులకే, భూమా ఫ్యామిలీకి పవన్ షాక్, టిడిపికి దెబ్బేనా?
భూమా ఫ్యామిలీకి జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ షాకిచ్చారు. పవన్ మద్దతు తమకేనంటూ భూమా మౌనిక ప్రకటించిన 3 రోజులకే పవన్ షాకిచ్చారు.
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని ప్రకటించిన జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ భూమా ఫ్యామిలీకి షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో పవన్కళ్యాణ్ తమకు మద్దతిస్తారని ఆశించిన భూమా ఫ్యామిలీకి నిరాశే ఎదురైంది. భూమా కుటుంబంతో పవన్కళ్యాణ్కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సంబంధాలను ఆసరాగా చేసుకొని భూమా ఫ్యామిలీ పవన్ మద్దతిస్తారని భావించినా జనసేన నిర్ణయం భూమా ఫ్యామిలీకి నిరాశను కల్గించింది.
నంద్యాల అసెంబ్లీ స్థానంలో ముస్లిం మైనారిటీల తర్వాత గెలుపు ఓటములపై ప్రభావం చూపేది కాపు సామాజికవర్గం. ఈ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సుమారు 40 వేలకు పైగా ఉంటాయని అంచనా.
జనసేన చీఫ్ ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం నల్లేరుపై నడకేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ తరుణంలో జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి కూడ మద్దతివ్వబోనని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని జనసేన భావిస్తోంది. ఈ తరుణంలోనే నంద్యాల ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది.పవన్ తీసుకొన్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకొంది.

భూమా ఫ్యామిలీకి నిరాశే
నంద్యాల ఉప ఎన్నికల్లో టడిపి తరపున భూమా బ్రహ్మనందరెడ్డి బరిలో ఉన్నారు.భూమా నాగిరెడ్డి కటుంబంతో జనసేన చీఫ్ పవన్కళ్యాణ్కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2009లో పిఆర్పి తరపున భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి పోటీచేశారు. ఆ సమయంలో భూమా కుటుంబసభ్యుల తరపున చిరంజీవి, పవన్కళ్యాణ్ ప్రచారం చేశారు. పిఆర్పిలో భూమా దంపతులున్న సమయంలో పవన్కళ్యాణ్తో ఆ కుటుంబానికి ఉన్న సంబంధాల నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికల్లో మద్దతివ్వాలని భూమా ఫ్యామిలీ సభ్యులు పవన్ను కోరే ప్రయత్నం చేశారు. అయితే పవన్ తీసుకొన్న నిర్ణయం మాత్రం భూమా ఫ్యామిలీకి నిరాశే కల్గించింది.

మౌనిక ప్రకటించిన మూడు రోజులకే
జనసేన చీఫ్ పవన్కళ్యాణ్కు తమ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఏపీ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక మూడు రోజుల క్రితం ప్రకటించారు. పవన్ మద్దతు తమకే ఉంటుందనే ధీమాను మౌనిక వ్యక్తం చేశారు. తమ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే పవన్ మద్దతు లభిస్తోందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. కానీ, చివరకు నిరాశే ఎదురైంది. మంత్రి అఖిలప్రియ కూడ పవన్తో తమ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని ఎన్నికల సందర్భంగా అప్పుడప్పుడూ ప్రస్తావించారు.

వ్యూహత్మకంగానే పవన్ తటస్థ నిర్ణయం?
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో ఏ పార్టికి మద్దతివ్వకుండా తటస్థంగా ఉండాలని జనసేన నిర్ణయం తీసుకోవడం వ్యూహత్మకంగానే వ్యవహరించారనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ళ పాటు ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టిన పవన్ ఈ సమయంలో టిడిపికి మద్దతిస్తే రాజకీయంగా తప్పుడు సంకేతాలను పంపించినట్టు అవుతోందనే కారణంతో జనసేన ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లెఫ్ట్తో ప్రత్యామ్నాయ కూటమిలో పవన్
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయశక్తుల వేదికల ఏర్పాటులో కీలక భూమికను పోషించనున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు పవన్ సహయంతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలను ప్రారంభించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లెఫ్ట్ పార్టీల నేతలు ఇప్పటికే ఈ విషయమై పవన్కళ్యాణ్తో చర్చించారు. అక్టోబర్ నుండి రాజకీయాల్లో పూర్తి సమయాన్ని పవన్ కేటాయించనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ తరుణంలో టిడిపికి మద్దతివ్వడం సరైంది కాదనే అభిప్రాయం కూడ ఉంది. వీటన్నింటిని దృష్ట్యానే పవన్కళ్యాణ్ తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారనే అభిప్రాయాలను కూడ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications