మీరెందుకు కొట్టడం..! జనసైనికులపై పవన్ అసంతృప్తి.! కీలక సూచన..!
ఏపీలోని మచిలీపట్నంలో తాజాగా గిరిధర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ పై జనసేన శ్రేణులు దాడి చేశాయి. ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ పవన్ పై అతను చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఆర్ఎంపీ డాక్టర్ ను మోకాళ్లపై నిలబెట్టి జనసేన శ్రేణులు క్షమాపణ చెప్పించడం వివాదాస్పదం కావడంతో దీనిపై పవన్ ఇవాళ స్పందించారు. జనసేన నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్.. ఈ సందర్బంగా వారికి కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల ముసుగులోనో, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నామన్నారు.

వారి ఉచ్చులో పడి, ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావరణానికి తావీయవద్దని జనసేన శ్రేణులకు సూచించారు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణ అని పవన్ తెలిపారు. ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడని, అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి, ప్రచారం చేయడం వెనక ఉన్న కుత్సిత ఆలోచనను పసిగట్టాలని వారిని కోరారు. దానిపై చట్ట ప్రకారం కేసులుపెట్టి ముందుకు వెళ్ళాలన్నారు.
తొందరపడి మరో మార్గంలో వెళ్ళి ఘర్షణ పడటం ద్వారా సమస్య జటిలం అవుతుందన్నారు. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారన్నారు. ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలన్నారు. కులాలు, మతాల మధ్య విభేదాలు తీసుకువచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ దిశగా ముందుకు వెళ్ళాలని జనసేన నాయకులు, శ్రేణులతోపాటు కూటమి నాయకులకు సూచించారు.

సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్ రూపంలోనో, విశ్లేషకుల ముసుగులోనో రెచ్చగొట్టే వారినీ, అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారినీ భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలపాలన్నారు. వీరి వెనక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసేవారిపైనా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలన్నారు. మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశారు. కుట్రలు చేసేవారి కుత్సిత నైజం కలిగిన పార్టీ, ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా, చట్ట ప్రకారమే తిప్పికొడదామన్నారు.












Click it and Unblock the Notifications