గెలుస్తానో లేదో, అందుకే చిరంజీవి పీఆర్పీని కలిపేశారు: పవన్ కళ్యాణ్
విజయవాడ: తాను ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగితే తాను కార్పోరేటర్గా కూడా గెలుస్తానో కూడా తనకు తెలియదని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే, జనసేన పార్టీతో ప్రజల సమస్యలను లేవనెత్తడమే తన ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు.
సోదరుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్నారా? అందుకోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అని ప్రశ్నించగా... అది పూర్తిగా అవాస్తవమని, నేను ఎప్పుడు కూడా ఆ కోణంలో ఆలోచన చేయలేదని చెప్పారు.
రాజకీయాలు చెడిపోయాయని, అందుకే తన అభిమానులు రాజకీయాల్లోకి వచ్చి బాగా చేయమని కోరుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాలు చాలా పవిత్రమైన వర్క్ అన్నారు. ఎందుకంటే మన ప్రతి రోజు జీవితం రాజకీయాలతో, నాయకులతో ముడివడి ఉంటుందని చెప్పారు.
రాజకీయాలు అంటే తన దృష్టిలో పవిత్రమైనదని, కొందరు మాత్రం దానిని బురదకూపంగా మార్చారన్నారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని, ఆ తర్వాతే జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. ప్రజారాజ్యం మంచి లక్ష్యాలతో ఏర్పాటైన పార్టీ అని, అందుకే దాని కోసం తాను బాగా కష్టపడ్డానని చెప్పారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడంతో పార్టీలోని కొందరు నేతలు దానిని జీర్ణించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు నేతలు తన సోదరుడు చిరంజీవికి నైతికంగా అండగా నిలవలేకపోయారని చెప్పారు. ఆ కారణంగానే ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని చెప్పారు. లేదంటే ఆయన పీఆర్పీని ఉంచేవారని చెప్పారు.