ఏపీలో 2024 ఎన్నికల్లో గెలుపెవరది - బీజేపీ హైకమాండ్ లెక్క పక్కా..!!
ఏపీలో 2024 ఎన్నికల పై సమరం మొదలైంది. వైసీపీ వర్సస్ టీడీపీ వయా పవన్ కల్యాన్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరికి వారు గెలుపు పైన ధీమాగా ఉన్నారు. ఇటు..జనసేన ఎవరితో కలుస్తుందనే అంశం పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారనే అంశం పైన ఢిల్లీలోని బీజేపీ నేతలకు మాత్రం పక్కా క్లారిటీ ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన తరువాత ఢిల్లీ కేంద్రంగా ఏపీ పైన జరిగిన చర్చల్లో కమలం పార్టీ అగ్ర నేతల అంచనాలు స్పష్టమయ్యాయి. కేంద్రంతో తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ..ఏపీలో ఏ రకంగా అడుగులు వేయాలే క్లారిటీతో ఉంది. ఇందు కోసం తొలి లక్ష్యంగా 2024 ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ నేతలు ఎవరి గెలుపు కోరుకుంటున్నారు..ఏ అంచనాలతో ఉన్నారనేది ఆసక్తిని పెంచుతోంది.

ప్రధాన పర్యటనతో ఆపరేషన్ బిగిన్...
ప్రధాని మోదీ ఏపీకి వచ్చే కొద్ది రోజుల ముందు ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు వెళ్లి చంద్రబాబు మంతనాలు చేసారు. దీంతో, ఏపీలో మరోసారి టీడీపీ - జనసేన పొత్తు ఖాయమనే చర్చ మొదలైంది. పవన్ బీజేపీని వీడి చంద్రబాబుతో జత కట్టటం ఖాయమని భావించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ.. ప్రధాని కార్యాలయం నుంచి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. పవన్ ప్రధానితో భేటీ అయ్యారు. ఆ తరువాత టీడీపీతో పవన్ కంటిన్యూ అవకాశాలు లేవన బీజేపీ నేతలు చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా..చంద్రబాబు వచ్చే ఎన్నికల పైన ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం కొత్త టర్న్ తీసుకుంది. పవన్ తో ఇక పొత్తుకు అవకాశం లేదనే అంచనాతోనే చంద్రబాబు ప్రజల్లోకి సెంటిమెంట్ చొప్పించే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇక ఇవే చివరి ఎన్నికలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ఆశలను పెంచాయి.

టీడీపీ లేకుంటే తమకే ఛాన్సంటున్న బీజేపీ...
ఏపీలో గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా రాజకీయంగా తాత్కాలికంగా మేలు జరిగినా...భవిష్యత్ లో నష్టపోతారంటూ కమలం నేతలు పవన్ కల్యాణ్ ను వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఇవే చివరి ఎన్నికలంటూ చంద్రబాబే అంగీకరించిన విషయాన్ని బీజేపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ - జనసేన కూటమి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించగలిగితే.. 2029 ఎన్నికల నాటికి అధికారం ఖాయమనే అంచనాలతో కాషాయం పార్టీ నేతలు ఉన్నారు. అదే పవన్ కు వివరించినట్లు సమాచారం. అదే విషయాన్ని ఇప్పుడు పవన్ ప్రస్తావిస్తున్నారు. వచ్చే 2024, 2029 ఎన్నికలు కీలకమైనవిగా చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని చెబుతూనే..2029 ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. ఫలితంగా బీజేపీ ఫిక్స్ చేసిన రోడ్ మ్యాప్ కు అనుగుణంగానే పవన్ ఈ వ్యాఖ్యలు చేసారనే చర్చ మొదలైంది.

టీడీపీ స్థానంలో ఎదగాలి.. 2024 ఎన్నికల్లో ఇలా
ఇప్పటికే ఏపీ అధికార వైసీపీ కేంద్రంలోని బీజేపీతో సఖ్యతతో ఉంది. ప్రధానితో తమ సంబంధాలు రాజకీయాలకు అతీతమని సీఎం స్పష్టం చేసారు. అదే సమయంలో 2019 ఎన్నికల సమయంలో తమకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించిన తీరును ఇప్పటికీ బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. టీడీపీతో పవన్ కలిస్తే హోరా హోరీ తప్పదని.. విడివిడిగా పోటీ చేస్తే జగన్ కే అనుకూలంగా మారే అవకాశం ఉందని బీజేపీ ఢిల్లీ నేతలు స్పష్టమైన అంచనా. ఈ సారి కేంద్రంలోనూ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నా..సీట్లు తగ్గినా ఇబ్బంది లేకుండా తమ మిత్రుల విషయంలోనూ బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో, 2024 లో జగన్ తిరిగి సీఎం అయినా.. 2029 లో ఏపీలో అధికారం లక్ష్యంగా పని చేయాలనేది బీజేపీ టార్గెట్. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు.. అనుకున్న విధంగానే కార్యాచరణ అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications