పవన్ కళ్యాణ్!...పార్టీ బలోపేతానికి పక్కా ప్రణాళికలతో ముందుకు
అమరావతి:వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమేరకు ఉంటుంది?....ఈ ప్రశ్నను సూటిగా అడిగితే రాజకీయ విశ్లేషణలో ఎంతటి నిపుణులైనా ఖచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి...అలాగని ఆ పార్టీని ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీలులేదనేది అనుభవజ్ఞుల మాట.
Recommended Video
ఈ క్రమంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చాపకింద నీరులా జనసేన విస్తృతమైన కార్యక్రమాలు చేపడుతోంది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టపరిచేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రజాపోరాట యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూనే మరోవైపు జనసేన బలోపేతానికి నిపుణులతో కలసి పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
సత్తా చాటాలనే...పట్టుదలతో
రాష్ట్రంలో పోటాపోటీగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీలకు తృతీయ ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగాలని ఆ పార్టీ ఆధినేత పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు. అగ్ర సినీ కథానాయకుడిగా గుర్తింపు...ప్రశ్నించే వ్యక్తిగా అందరి ఆదరణ...తమ వర్గానికి చెందిన వ్యక్తిగా బలమైన కాపు సామాజిక వర్గం అండదండలు... విస్తృత పర్యటనలతో ప్రజాపోరాట యాత్రకు వస్తున్న ఆదరణ...వీటన్నింటి తోడ్పాటుతో వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలిసింది.
యువత...మాస్ ఫాలోయింగ్...
పవన్ కళ్యాణ్ కు యువత నుంచి అసంఖ్యాకమైన మద్దతు...మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉండటంతో వాటిని ఓటు బ్యాంకులుగా మలుచుకునేందుకు జనసేన పకడ్బందీ ప్రయత్నాలు ఆరంభించింది. ఆ దిశలో ముందుగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నేతలు అవసరమని కొత్త నాయకత్వాన్ని తయారు చేసేందుకు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ శిక్షణా తరగతుల్లో నాయకులు తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో పోరాట స్ఫూర్తి రగిలిస్తున్నారు.
నేతల గుర్తింపుకు...ప్రాధాన్యత
తమ పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటీవలి కాలంలో పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఇదే క్రమంలో మంచి వాగ్ధాటి ఉన్న నేతల కోసం జల్లెడ పడుతోంది. ప్రజా ఉద్యమాల్లో అనుభవమున్న నేతలకు ప్రాధాన్యమిస్తూ వారికి కీలక బాధ్యతలు కట్టబెడుతోంది. అంతేకాదు పార్టీ సభ్యత్వ నమోదు కూడా ఏదో తూతూమంత్రంలా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. బలమైన క్యాడర్ ఉన్న టీడీపీ, వైసీపీలకు ధీటుగా ఓటుబ్యాంకు క్రమంగా పెంచుకోవాలని జనసేన నేతలు పట్టుదలతో వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అలాగే మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారు సామాజిక, రాజకీయ, ఆర్థికరంగాల్లో పట్టు సాధించేలా మహిళా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.
కులాలు కలిపే ఆలోచన...స్పందన
జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన ‘కులాలను కలిపే ఆలోచన'కు వివిధ పార్టీలకు చెందిన సామాజికవర్గ నేతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గతంలో వైసిపి ముమ్ముడివరం నియోజక వర్గ కోఆర్డినేటర్ గా ఉన్న పితాని బాలకృష్ణ తన అనుచరులతో కలిసి హైదరాబాద్లో జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీలో చేరేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. పవన్కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సేన పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. శెట్టిబలిజ వర్గీయులకు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యం దక్కడంలేదని ఈ సందర్భంగా ఆయన పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పవన్ వచ్చే ఎన్నికల్లో శెట్టిబలిజలకు జనసేన సరైన ప్రాధాన్యాన్ని ఇస్తుందని హామీ ఇచ్చారు. శెట్టిబలిజలతోపాటు వెనుకబడిన కులాలకు తాను అండగా ఉంటానన్నారు. వీటన్నింటిని బట్టి పవన్ జనసేన బలోపేతానికి పక్కా ప్లాన్ తోనే ముందుకు కదులుతున్నట్లు తేటతెల్లమవుతోంది.