వారితో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ కల్యాణ్
విశాఖపట్నానికి చెందిన పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇటీవల విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్లపై రాళ్ల దాడి జరిగింది. దీనికి కారకులుగా భావిస్తూ ప్రభుత్వం 100కు పైగా జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయగా జనసేన న్యాయవిభాగం వీరిని బెయిల్ పై బయటకు తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో 9 మంది నాయకులకు కోర్టు రిమాండ్ విధించగా వారిని కూడా బెయిల్ పై బయటకు తెచ్చారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండురోజులపాటు జరిగే సమావేశాలకు హాజరైన పవన్ ఆ 9 మంది నాయకులు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో తాము ఎదుర్కొన్న ఇక్కట్లను వివరించారు. భయపడాల్సిన అవసరం లేదని, నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని అభయం ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా వారందరికీ పవన్ శాలువా కప్పి సత్కరించారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండురోజులపాటు పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీకి చెందిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) ఇచ్చే నివేదికపై చర్చ జరగనుంది. జనసేన తమతోనే ఉందని భారతీయ జనతాపార్టీ నేతలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.