'పవన్ విషయం తేలిపోయింది, ఎవరైనా అలా చెప్తారా?': మేలో ఆమరణ దీక్షకు ఛాన్స్
Recommended Video

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు స్థిరత్వం లేదని తేలిపోయిందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్పలు విమర్శించారు. ఇరువురు మంత్రులు బుధవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
పవన్ స్థిరత్వం లేని మనిషి అని తేలిపోయిందన్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు వ్యాఖ్యలతో పవన్ వెనుక బీజేపీ ఉందని తేలిందని, ఎవరైనా తమ గురించి చెప్పుకోకుండా పక్క పార్టీ బలంగా ఉందని చెబుతారా అని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నవారే ముద్రగడ వెనుక
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెనుక ఉన్న వాళ్లే పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నారని మంత్రులు ఆరోపించారు. వాళ్లు అప్పుడప్పుడు పోరాడితే తాము నిత్యం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఎంతమంది కలిసినా తెలుగుదేశం పార్టీని ఏం చేయలేరని, తమ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.

రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయాలి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా రాదని టీడీపీ నేత జలీల్ ఖాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన అవినీతి ప్రతి ఒక్కరికి తెలుసునని చెప్పారు.

ఆమరణ దీక్షపై వామపక్ష నేతలతో చర్చ
ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బుధవారం వామపక్ష నేతలు భేటీ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమరణదీక్ష చేపట్టడంపై వామపక్ష నేతలతో చర్చించారు.

మే నెల తర్వాత ఆమరణ దీక్షకు ఛాన్స్
అలాగే, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) నివేదిక, ఢిల్లీ పరిణామాల పైన కూడా చర్చించారని తెలుస్తోంది. మంగళగిరిలో గత నెలలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకైనా తాను సిద్ధమేనని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెల తర్వాత పవన్ ఆమరణ దీక్షకు దిగే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications