కోపానికి చెక్! బాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించారా, క్లారిటీ వచ్చిందా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రిత ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు ఆయనతో ఏమేం మాట్లాడారనే విషయమై ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
వారి మధ్య ఏం జరిగిందనేది స్పష్టంగా తెలియనప్పటికీ.. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయం పైన ప్రధానంగా చర్చ సాగింది! కేంద్ర రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లో ఏపీకి న్యాయం దక్కక పోవడంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తికి లోనయ్యారు. ఈ విషయంలో చంద్రబాబుకు అండగా నిలవడంతో పాటు.. ఇరువురు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
అదే సమయంలో రాజధాని భూసమీకరణ పైన కూడా చర్చ సాగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాజధాని భూసమీకరణ పైన పలువురు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై పవన్ ఏపీ సీఎంను ప్రశ్నించి క్లారిటీ తీసుకొని ఉండవచ్చునని అంటున్నారు.
రాజధాని భూసమీకరణలో రైతులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వారి ఆందోళనలో నిజమెంత, చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న దానిలో వాస్తవమెంత అని తెలుసుకునేందుకే పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు సన్నద్దమయ్యారని అంటున్నారు. మొత్తానికి రెండు రోజుల క్రితం నాటి భేటీలో పవన్.. చంద్రబాబును భూసమీకరణ పైన విపులంగానే అడిగి ఉంటారని అంటున్నారు. వారి భేటీ గంటన్నరకు పైగా సాగడం అందుకు నిదర్శమని చెబుతున్నారు.
ఆదివారం ఉదయం చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ ఆయనను ఏయే అంశాల పైన ప్రశ్నించి ఉంటారని, అలాగే ఏపీకి కేంద్రం సాయం, భూసమీకరణ పైన ఏమి అడిగి ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది.
చంద్రబాబుతో పవన్ భేటీ పైన వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పవన్ మధ్యవర్తిత్వ అంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.