బాబూ! 2014లో కాంగ్రెస్తో కలవాల్సింది, షర్మిల చేయించారా?: జగన్ మీద దాడిపై పవన్ కళ్యాణ్
తుని: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కలయిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉనికి కోసమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం వల్లే సమీకరణాలు మారుతాయి తప్ప పార్టీల కలయికల వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు.
నిన్న (గురువారం) ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చూపించింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిది అని పవన్ ఎద్దేవా చేశారు. కానీ చంద్రబాబు సినిమా ప్లాప్ కావడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలవడం చూస్తుంటే ఆయన ఎక్కడ మొదలయ్యారో అక్కడకే చేరుకున్నట్లుగా ఉందన్నారు.

చంద్రబాబు 2014లో ఈ నిర్ణయం తీసుకోవాల్సింది
చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని 2014లోనే తీసుకోవాల్సి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం బలమైన పోరాటం చేయాలని ప్రజలకు సూచించారు. తన పర్యటనలోను పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డానని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తాను యాత్రలు చేస్తున్నానని చెప్పారు. తాను అధికారం కోసం పాదయాత్రలు చేయడం లేదన్నారు.

జగన్ మీద దాడిపై పవన్ స్పందన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై పవన్ స్పందించారు. దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలని చెప్పారు. నిందితుడు శ్రీనివాస రావు దాడి కావాలని చేశాడా లేక ఎవరైనా చేయించారా తెలియాలన్నారు. కుట్ర కోణం ఉన్నదా అనేది పోలీసుల విచారణలో తేలాలని చెప్పారు. టీడీపీ నేతలు వెలికిగా మాట్లాడటం సరికాదన్నారు

విజయమ్మ, షర్మిలలు దాడి చేయిస్తారా?
జగన్ పైన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దాడి చేయించారని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పు అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా తల్లే కొడుకు పైన దాడి చేయిస్తుందా అని ఎద్దేవా చేశారు. విజయమ్మ, షర్మిల తనను ఎన్నో తిట్టారని గుర్తు చేశారు. అలాగని తాను వాళ్లను ఏమీ అనలేదని చెప్పారు.

టీడీపీ నేతలు లక్ష్మణ రేఖ దాటారు
తెలుగుదేశం పార్టీ నేతలు లక్ష్మణ రేఖను దాటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ పైన దాడి ఘటన మీద రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని చెప్పారు.

అన్నయ్య చిరంజీవిని కాదని చంద్రబాబుకు మద్దతిస్తే
కాంగ్రెస్, టీడీపీ పొత్తు చంద్రబాబు అధికార దాహానికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. తన అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం తాను ఆ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు. నేను రాష్ట్రం కోసం టీడీపీకి మద్దతిస్తే మళ్లీ ఇప్పుడు చంద్రబాబు వారితో కలవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications