పుష్ప కోసం నేరుగా రంగంలోకి పవన్..! 8, 9 తేదీల్లో టూర్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సమస్యగా మారిన ఎర్రచందనం అక్రమ రవాణా అంశంపై సీరియస్ గా ఉన్న అటవీ మంత్రి పవన్.. అక్కడికే వెళ్లి తాడోపేడో తేల్చేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా తన టూర్ కు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పవన్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారని జనసేన పార్టీ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 8వ తేదీ తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోని ఆయన సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

అలాగే ఈ నెల 9వ తేదీ పవన్ కళ్యాణ్.. పలమనేరులోని కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శిస్తారు. కుంకీ ఏనుగుల సంరక్షణతోపాటు - ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో పవన్ స్వయంగా చొరవ తీసుకుని కర్నాటక వెళ్లి అక్కడి ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించి కుంకీ ఏనుగుల్ని తెప్పించారు.

ఇప్పటివరకూ ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ క్షేత్రస్దాయిలో పర్యటనలు చేస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం రెండు కీలక సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. గతంలో ఎర్రచందనం దొంగలు అటవీ ప్రాంతంలో పోలీసులపై దాడులు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనల్ని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications