జవాబివ్వు, ఎవరితో మంచిగా ఉంటావ్: కెసిఆర్పై పవన్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం కరీంనగర్ జిల్లాలో నిప్పులు చెరిగారు. హైదరాబాదు అభివృద్ధి గురించి మాట్లాడుతున్న కెసిఆర్.. పల్లె కన్నీరు పెడుతుందనే పాటను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. తాను ఓట్లు చీల్చేందుకు జనసేనను స్థాపించలేదని చెప్పారు. తాను సినిమాలు చేస్తూనే... తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధికి పాల్పడుతానని చెప్పారు.
తనకు రెండు ప్రాంతాల అభివృద్ధి కంటే సినిమాలు అంత ముఖ్యం కాదన్నారు. సినిమాలు చేస్తూనే.. రెండు ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు. హరీష్ రావు తన పైన కేసులు పెట్టినా, దావాలు వేసిన తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమేనని చెప్పారు. తనకు ఎలాంటి భయం లేదన్నారు. బంగారు తెలంగాణ కోసం తాను సమిధను అవుతానని చెప్పారు. రెండు ప్రాంతాల సమాన అభివృద్ధిని కోరుకునే భారతీయుడను తాను అన్నారు.
హరీష్కు బొత్సకు సంబంధాలు ఉన్నాయంటే తనను తిడుతున్నారని...ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అందకుముందు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో అన్నారు. తెలంగాణలో దేవాలయాలు లేవా? తెలంగాణలో నవగ్రహ దేవాలయాలే లేవా? అని ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు అరసవెల్లి వెళ్లి బొత్సతో బంధం కలుపుకునేంత అవసరం హరీష్ రావుకు ఏమొచ్చిందన్నారు.

ఎన్నికల ప్రచారం పేరిట ప్రతి పార్టీని తిడుతూ ఉంటే తరువాత వారితో సత్సంబంధాలు ఎలా నెరుపుతారన్నారు. మూడేళ్ల తరువాత విద్యుత్ ఇస్తామని కెసిఆర్ అంటున్నారని, అప్పటి వరకు విద్యుత్ సరఫరా చేయరా? చేస్తే ఎలా చేస్తారు? ప్రకటిస్తున్న పథకాలు ఎలా అమలు చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే వారిని తిడుతూ... కేంద్రం నుంచి నిధులు ఎలా తెప్పించుకుంటారని ప్రశ్నించారు.
కెసిఆర్ బాధ్యతగల నేతే అయితే అలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. పక్క రాష్ట్రాలతో గొడవలు పడితే సమస్యలు పెరుగుతాయి తప్ప పరిష్కారాలు దొరకవన్నారు. కేంద్రాన్ని, మోడీని, సోనియాని విమర్శిస్తూ గొడవలు పెట్టుకుంటుంటే... ఎవరితో మంచిగా ఉంటారో చెప్పాలన్నారు.
బిసి నేతలపై తిట్ల దండకం వినిపిస్తున్న కెసిఆర్... బిసి వ్యతిరేకి అన్నారు. షబ్బీర్ అలీకి తానంటే చాలా కోపమని పవన్ అన్నారు. ఆయన తనను తిట్టినా పర్లేదన్నారు. ఆంధ్రాభవన్లో ఆంధ్రులపై మరోసారి దాడులు జరిగితే తన అసలు స్వరూపం చూస్తారని తెరాసను హెచ్చరించారు. తాను ప్రజల కోసం వచ్చానని, నిండు ప్రాణాలు బలవుతుంటే, న్యాయం జరగక పోవడంతో... బాధతో, అసహనంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
తనకు తెలుగుదేశం అంటే ప్రత్యేక ప్రేమ లేదని, పొత్తు ధర్మంలో భాగంలో మద్దతిస్తున్నానన్నారు. మోడీ ప్రధాని అయితే దేశాభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. తనకు ఇంకా సినిమాలపై ఆసక్తి ఉన్నా లేకున్నా, అంతకంటే దేశానికి సేవ చేయాలన్న తపన ఉందని ఉందన్నారు.












Click it and Unblock the Notifications