అదికార పార్టీలో గుబులు రేపుతున్న పవన్ కళ్యాణ్ ఉత్తరాంద్ర పర్యటన..
జనసేన అధినత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన అదికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. పవన్ ప్రభుత్వం పై ఎక్కుపెడుతున్న విమర్శనాస్త్రాలు టీడిపి నాయకులను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ ఆరోపణలకంటే పవన్ విమర్శలు ప్రభుత్వానికి ఎక్కువ నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయని టీడిపి నేతలు నిర్ధారిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పవన్ ను కట్టడి చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు టీడిపి నేతలు.
Recommended Video
అదికార పార్టీని కలవర పెడుతున్న పవన్ ఉత్తరాంద్ర పర్యటన..
ప్రజాపోరాట యాత్ర పేరుతో జనసేనాని పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన యాత్ర అధికార టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. సాక్ష్యాత్తూ తెలుగుదేశం నేతలు పవన్ ప్రభావంపై తర్జనభర్జనలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు ఉత్తరాంధ్రను ఎంచుకోవటం వెనకే పక్కా వ్యూహాం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోకస్ అంతా అమరావతి, పోలవరం, పట్టిసీమ జపం తప్ప వేరే అంశాలేమీ మాట్లాడటం లేదనే అంశాలను పవన్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలుగుతున్నారు. ఏదో ఆయా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి అంశాలు ప్రస్తావించటం తప్ప..అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా దృష్టి సారించటం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో వాడుకుంటున్నట్టు తెలుస్థోంది.
పవన్ ఆరోపణలకు ప్రజలనుండి సానుకూల స్పందన..
శ్రీకాకుళం జిల్లాలో కానీ.. ప్రస్తుతం పవన్ పర్యటన సాగుతున్న విజయనగరం జిల్లాలోనూ పూర్తిగా ‘స్థానిక అంశాల'పైనే ఫోకస్ పెట్టి సర్కారు ఇరకాటంలో పెడుతున్నారు. పవన్ అదికార పార్టీని విమర్శిస్తున్నతీరు, ఎంచుకుంటున్న అంశాలు, ప్రశ్నిస్తున్న విధానం ఉత్తరాంద్ర ప్రజానీకానికి బాగా కనెక్టు అవుతున్నాయి. ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతిని పవన్ వివరిస్తున్నప్పుడు ప్రజలు పెద్ద యెత్తున స్పందిస్తున్నారంటే ఆయన ఉపన్యాసాలను ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో అర్థం అవుతోంది. ముఖ్యంగా లోకేష్ శాఖలో జరుగుతున్న రాజకీయ తతంగం, ముఖ్యమంత్రి విలాసాలకు ఖర్చుపెడుతున్న ప్రజాదనం, ఇసుక మాఫియా తదితర అంశాల పైన పవన్ మాట్లాడుతున్న విధానం ప్రజల చేత కేరింతలు కొట్టిస్తోంది.
జగన్ ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదంటున్న టీడిపి నేతలు..
దాదాపు ఐదు నెలలుగా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కూడా పాదా యాత్ర చేస్తూ ప్రభుత్వ విధానాలు ఎండగడతున్నారు. కాని ప్రజల స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉండడం గమనార్హం. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు జగన్ ప్రతిరోజూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నప్పటికి ప్రజల స్పందన మాత్రం ఆశించిన మేరకు లేదనే చర్చ కూడా జరుగుతోంది. జగన్ విమర్శల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని గ్రహించిన టీడిపి నేతలు ఆయన వాఖ్యలకు అంత ప్రాధాన్యతను ఇవ్వడం కూడా తగ్గించారు. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆరోపణలపై మాత్రం ద్రుష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. అలాగే పవన్ విమర్శల పట్ల టీడిపి నేతలు అయోమయానికి గురౌతున్నట్టు కూడా తెలుస్తోంది. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు ఏకంగా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబే ముందుకు వస్తున్నారంటే పవన్ ఏ రేంజ్ లో ఆరోపణలు గుప్తిస్తున్నారో అర్థం చేసుకోచ్చు. స్థానికంగా ఉన్న రోడ్ల సమస్యలను..సాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగ యువత అంశాలను ప్రస్తావిస్తుండటంతో పవన్ అక్కడి ప్రజలకు బాగా ‘కనెక్ట్' అవుతున్నారని..ఇది ఏ మాత్రం తమకు సానుకూల సంకేతం కాదని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించడం విశేషం.
పవన్ కు అడ్డుకట్ట వేసేందుకు టీడిపి సోషల్ మీడియా అస్త్రం..
నవనిర్మాణదీక్షల పేరుతో 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ముఖ్యమా?. లేక అదే డబ్బుతో మత్స కార్మికులకు చేపలు పట్టుకునేందుకు జెట్టీలు ఏర్పాటు చేయించటం ముఖ్యమా? అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రభుత్వ దుబారాను..స్థానిక సమస్యలను కలిపి ప్రస్తావించటం ద్వారా ఆ ప్రాంత ప్రజల్లో ఈ సర్కారు తమను పట్టించుకోవటంలేదనే అభిప్రాయం కల్పించటంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతున్నట్లు ఆయన పర్యటనలు నిరూపిస్తున్నాయి. పవన్ ప్రసంగాలు...సమస్యల ప్రస్తావన టీడీపీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతోనే టీడీపీ సోషల్ మీడియా టీమ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శల దాడి పెంచింది. అంతే కాకుండా జగన్ తో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసే విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉండటంతో టీడీపీ నేతలను ఉలిక్కిపడేలా చేస్తోంది.